జీఎస్టీ హేలాపురి ఉత్సవాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:35 AM
జిల్లాలో జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో మరింత అవగాహన కోసం హేలాపురి ఉత్సవాలు పేరిట వారం రోజు వివిధ కార్యక్రమాలకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది.
సడలింపులపై అవగాహన ర్యాలీ.. బుల్లెట్పై కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో మరింత అవగాహన కోసం హేలాపురి ఉత్సవాలు పేరిట వారం రోజు వివిధ కార్యక్రమాలకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నగరంలో శాంతినగర్ పోలీస్ పెట్రోల్ బంకు నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీని కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిశోర్, జేసీ అభిషేక్ గౌడ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. హెల్మెట్లు ధరించి బైక్లతో ముందుకు సాగగా, కలెక్టర్ వెట్రిసెల్వి పోలీస్ అధికారి బుల్లెట్ ఎక్కి సాగడం గమనార్హం. ఉత్సవాల్లో భాగంగా గిరిజన భవన్లో గ్రాండ్ షాపింగ్ పెస్టివల్ను కలెక్టర్ వెట్రిసెల్వి, జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగినప్పుడు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సీఆర్రెడ్డి కళాశాలలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. అధిక మొత్తంలో షాపింగ్ చేసిన వారి పేర్లను ఉత్సవం చివరి రోజు డ్రా తీసి ముగ్గురి కి బహుమతులు అందిస్తామని కలెక్టర్ ప్రకటిం చారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ బి.నాగా ర్జునరావు, జడ్పీ సీఈవో శ్రీహరి, ఆర్డీవో అచ్యుత్ అంబ రీష్, డీటీసీ షేక్ కరీమ్, కార్మిక శాఖ డీసీ జి.నాగేశ్వర రావు, కమిషనర్ భానుప్రతాప్ పాల్గొన్నారు.
మంత్రి పార్థసారథికి ఆహ్వానం
జీఎస్టీ సంస్కరణలపై నిర్వహిస్తున్న హేలాపురి ఉత్సవ్కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రి కొలుసు పార్థసారధికి కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ బి.శ్రీనివాసరావు ఆహ్వానించారు. ఆయన వెంట జి.జాన్బాబు ఉన్నారు.