నిబంధనలు బేఖాతర్!
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:12 AM
గత అనుభవాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్య వైఖరితో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆరోగ్యం మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
మినీ ఫుడ్కోర్టులుగా ట్రిపుల్ ఐటీ ఫ్యాన్సీ దుకాణాలు
బయటి ఆహార పదార్థాలతో విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదం
(నూజివీడు టౌన్, ఆంధ్రజ్యోతి)
గత అనుభవాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్య వైఖరితో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆరోగ్యం మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్జీయూకేటీ పరిధి లోని నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని వసతి గృహాల్లోని ఫ్యాన్సీ దుకాణాల నిర్వాహుకులు ఫ్యాన్సీ వస్తువుల స్థానంలో ఆహార విక్రయాలు చేపట్టడమే అందుకు కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది మెస్లలో ఆహార నాణ్యత సక్రమంగా లేదని ఆరోపణలు కారణంగా బయట ఆహార ఉత్పత్తులను క్యాంపస్లోకి అనుమతించడంతో క్యాంపస్లోని విద్యా ర్థులు అధిక సంఖ్యలో అస్వస్థతకు గురైన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ బయట ఆహార ఉత్పత్తులను లోపలకు తీసుకురావ డానికి నిషేధించడంతో పాటు అప్పటి మెస్లను రద్దు చేసి ప్రత్యేకంగా మెస్ల నిర్వహణ రెండు క్యాటర్లకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే తిరిగి అవే పరి స్థితులు నెలకొనే అవకాశం ఏర్పడిందనే విమర్శ లు వస్తున్నాయి.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని నూజివీడు త్రిపుల్ ఐటీ క్యాంపస్లో నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్తో పాటు శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లకు చెందిన మొత్తం 8,879 మంది విద్యార్థులు ఇక్కడే వసతి సౌకర్యాలను పొందుతూ విద్యను అభ్యసిస్తున్నారు. బాలికలకు సంబంధించి మూడు వసతి గృహాలు, మరో రెండు బాలుర వసతి గృహాలతో కలిపి మొత్తం విద్యార్థులకు అక్టోబరు నుంచి మెస్ల నిర్వహణలో సమూల మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చింది. మెస్ లతో పాటు విద్యార్థులకు కావాల్సిన ఆహార పదార్థా లను అందించేందుకు (విద్యార్థులు వారి ఇష్టపూర్వ కంగా ఆహార పదార్థాలను కొనుగోలు చేసే విధంగా) క్యాంపస్లోనే ఫుడ్కోర్టును ఏర్పాటు చేసి దాని నిర్వహణను మెప్మాకు అప్పగించారు. వీటితో పాటు క్యాంపస్లో విద్యార్థుల సౌకర్యం కోసం ఫ్యాన్సీ దుకా ణాలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్యాన్సీ దుకా ణాలు నిర్వహణను మెప్మా ఇద్దరు వ్యక్తులకు అప్ప గించగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాన్సీ దుకాణాలు నిర్వహణను మరొకరికి అప్పగించగా ఫ్యాన్సీ దుకాణా లు చివరకు మినీ ఫుడ్కోర్టులుగా మారాయి. ఫుడ్ కోర్టుకు సంబంధించి ఆహార పదార్థాల తయారీ క్యాం పస్లోనే చేస్తుండగా ఫ్యాన్సీ దుకాణాలను క్యాంటీన్ల పేరుతో మార్పు చేసిన నిర్వాహకుడు ఆహార పదారా లను బయట నుంచి తీసుకొస్తున్నారు. పిజ్జా సమోసా , శీతల పానీయాలు, ఐస్క్రీమ్లు, తదితర పదార్థాలు విక్రయాలను చేపట్టాడు.దీనిపై చర్యలు చేపట్టాల్సిన ట్రిపుల్ ఐటీ అధికార బృందం మీనమేషాలు లెక్కిం చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం క్యాంపస్లోని ఫ్యాన్సీ దుకాణాలలో ఆహార పదార్థాల విక్రయించకూడదు. అయితే ఫ్యాన్సీ వస్తువు ల విక్రయాలు లాభసాటిగా లేవని ఆహార పదార్థాల విక్రయం చేయక తప్పడం లేదంటూ ఆహార పదా ర్థాలను బయట నుంచి దిగుమతి చేసుకొని విక్రయిం చడం విశేషం.గతంలో మాదిరి ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యులు ఎవరనే ప్రశ్న వ్యక్తమవుతోంది.
జ్వరాల బారిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
నూజివీడు ట్రిపుల్ ఐటీలో పలువురు విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారు. వారం రోజులుగా ట్రిపుల్ ఐటీలో ప్రతీరోజు 100 మందికి పైగా జ్వరం, గొంతు నొప్పి బారిన పడినట్టు సమాచారం. క్యాంపస్లో ఉన్న హెల్త్ క్లీనిక్లో ప్రతీ రోజు ఓపీ 200 నమోదు అవుతుండగా వాటిలో సగం కేసులు జ్వరాలు నమోదవుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.