బ్లాక్స్పాట్లో చెత్తవేస్తే జరిమానా
ABN , Publish Date - May 09 , 2025 | 12:26 AM
పట్టణాల్లో అపరిశుభ్ర వాతావరణానికి అధికారులు చెక్ పెడుతున్నారు. ఎక్కడబడితే అక్కడ చెత్త వేయకుండా మునిసిపల్ వాహనాలు వచ్చినప్పుడే ఇవ్వాలని అధికారులు విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఆరు మునిసిపాలిటీల్లో 214 ప్రాంతాల గుర్తింపు
చెత్త వెయ్యకుండా ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ
భీమవరంలో సీసీ కెమెరాలు, బోర్డుల ఏర్పాటు
పట్టణాల్లో అపరిశుభ్ర వాతావరణానికి అధికారులు చెక్ పెడుతున్నారు. ఎక్కడబడితే అక్కడ చెత్త వేయకుండా మునిసిపల్ వాహనాలు వచ్చినప్పుడే ఇవ్వాలని అధికారులు విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని బ్లాక్ స్పాట్లను గుర్తించి ఇక్కడ చెత్త వేయరాదంటూ స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన ప్రయోజనం కనిపించకపోవడంతో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. బయట చెత్త వేస్తే జరిమానా విధించాలని నిర్ణయించారు.
భీమవరం టౌన్, మే 8(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర–స్వ ర్ణాంధ్రలో భాగంగా బ్లాక్ స్పాట్లలో చెత్త వేయకుండా నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు మునిసిపాటీల్లో 214 బ్లాక్స్పాట్లను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో చెత్త వెయ్యకుండా నిఘా ఉంచి కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రతీ వార్డులో గుర్తించిన బ్లాక్స్పాట్లో చెత్త వెయ్యకుండా నిరంతర పర్యవేక్షణకు సచివాలయ ఉద్యోగితోపాటు పారిశుధ్య కార్మికుడిని ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా చెత్త వేస్తే జరిమానా విధిస్తారు. అవసరమైతే కఠినచర్యలు తీసుకుంటారు.
సీసీ కెమెరాల ఏర్పాటు
భీమవరంలో గుర్తించిన 59 ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డు లు పెట్టారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మునిసిపల్ పారిశుధ్య విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అనుమతి రాగానే వీటిని ఏర్పాటుచేసి చెత్త వేసేవారిని గుర్తిస్తారు.
పట్టణంలో ప్రత్యేక నిఘా
పట్టణంలో బ్లాక్స్పాట్లో చెత్త వేసే వేరిని గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలు పెడుతున్నాం. అలాగే చెత్త వేస్తున్నప్పుడు ఎవరైనా గమనించి ఫొటో తీసి పంపిస్తే కఠిన చర్యలు చేపడతాం. ప్రతీ స్పాట్ వద్ద ఇద్దరు చొప్పున సిబ్బందిని ఏర్పాటుచేశాం.
– కె.రామచంద్రారెడ్డి, కమిషనర్