కోకో ధర తగ్గడంలో కంపెనీల కుట్ర
ABN , Publish Date - May 24 , 2025 | 12:33 AM
కోకో గింజల ధరపై ప్రభుత్వం నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు విఫలమైనట్లు ఏసీ కోకో రైతుల సంఘం నాయకులు ప్రకటించారు.
కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా
ఏలూరు రూరల్, మే 23 (ఆంధ్రజ్యోతి): కోకో గింజల ధరపై ప్రభుత్వం నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు విఫలమైనట్లు ఏసీ కోకో రైతుల సంఘం నాయకులు ప్రకటించారు. కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా బహుళజాతి కంపెనీల మోసాలకు నిరసనగా కలెక్టరేట్ శుక్రవారం కోకో రైతులు ధర్నా నిర్వహించారు. కోకో రైతులకు న్యాయం చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కార్పొరేట్ కంపెనీల మోసాలను అరికట్టాలపి నినాదాలు చేశారు. కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 3 నెలలుగా కోకో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని, గత వారం రోజులుగా పోరాటాన్ని ఉధృతం చేశామన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సమక్షంలో చర్చలకు మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడాన్ని ఖండించారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలు రూ.880 ఉంటే మోండలీజ్ కంపెనీ రూ.450 కు మించి ధర ఇవ్వలేమని చెప్పడం దుర్మార్గం అన్నారు. ఇది బహుళజాతి కంపెనీల కుట్రలో భాగమని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు ప్రకటించిన నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రైతు సంఘం నేతలు కె.శ్రీనివాస్, వై.కేశవరావు, మాగంటి హరిబాబు మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలను బుజ్జగించేవిధంగా చర్చలు సాగడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.గోపాలకృష్ణ, బొల్ల రామకృష్ణ, బోళ్ళ వెంకట సుబ్బారావు, ఉప్పుగంటి భాస్కరరావు, పానుగంటి అచ్యుతరామయ్య, గుదిబండి వీరారెడ్డి, ఉప్పల కాశీ, కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్, కోనేరు సతీష్బాబు, చింతకాయల బాబురావు, ఇతర జిల్లాల రైతులు పాల్గొన్నారు.