ఇంకెన్నాళ్లు..?
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:34 AM
రబీ సీజన్లో అంచనాకు మించి ధాన్యం దిగుబడులు వచ్చాయి. ప్రభుత్వం కూడా లక్ష్యానికి మించి ధాన్యం సేకరించింది.
ధాన్యం బకాయి సొమ్ముల కోసం రైతుల ఎదురుచూపు
జిల్లాలో బకాయిలు రూ. 293 కోట్లు
ఖరీఫ్ తరుముకొస్తోంది
పెట్టుబడి ఎక్కడిది?
రబీ అప్పులు తీర్చేదెలా ?
ఆందోళనలో అన్నదాత
రబీ సీజన్లో అంచనాకు మించి ధాన్యం దిగుబడులు వచ్చాయి. ప్రభుత్వం కూడా లక్ష్యానికి మించి ధాన్యం సేకరించింది. రైతులకు 24 గంటల్లో సొమ్ము చెల్లించింది. అయితే అదనంగా సేకరించిన ధాన్యానికి బకాయిలు పేరుకుపోయాయి. వాటికి 40 రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బకా యిలు పేరుకుపోయాయి. జిల్లాలో రైతులకు రూ. 293 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఒకవైపు ఖరీఫ్ తరు ముకొస్తోంది. మరోవైపు రబీ సాగుకు చేసిన అప్పులు తీర్చే మార్గంలేదు. ధాన్యం విక్రయించి 45 రోజులు గడిచినా సొమ్ము జమ కాకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
అంచనాకు మించిన దిగుబడి
వాస్తవానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాల్లో ధాన్యం సొమ్ములు జమ చేస్తూ వచ్చింది. రబీ సీజన్లో అంచనాకు మించి ధాన్యం దిగుబడి వచ్చింది. రైతులంతా ప్రభుత్వానికే ధాన్యం విక్రయించారు. జిల్లా వ్యాప్తంగా 7.40 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. గత ఏడాది 6.40 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. ఈ సారి అదనంగా లక్ష టన్నుల సేకరించడంతో బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యానికి దాదాపు రూ.1400 కోట్లు చెల్లిం చారు. మరో రూ.293 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇతర జిల్లాల్లో పరిమితికి మించి ధాన్యం కొనుగోలు చేశారు. అక్కడే పౌరసఫరాల కార్పొరేషన్ అంచనా దెబ్బతింది. అంచనా మించిన దిగుబడి, ప్రైవేటు కొనుగోళ్లు లేకపోవడంతో మొత్తం ధాన్యం ప్రభుత్వ మే సేకరించింది. తొలుత మిల్లుల్లో నమోదైన 24 గంటల వ్యవధిలోనే రైతు ఖాతాలో సొమ్ములు జమ చేశారు. ఇలా జిల్లాలో రూ.1400 కోట్లు రైతులకు సక్రమంగా జమ అయిపోయాయి. అదనపు సేకరణ అనంతరం రూ.293 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో సొమ్ముల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.