డీఎస్సీ ప్రారంభం
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:19 AM
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ 2025 పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది.
తొలి రోజు పరీక్షకు 23 మంది అభ్యర్థుల గైర్హాజరు
ఐదు పరీక్ష కేంద్రాలకు ఒక కేంద్రంలోనే మొదటి పరీక్ష
భీమవరంలో కలెక్టర్ నాగరాణి తనిఖీ
భీమవరం రూరల్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ 2025 పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఐదు పరీక్ష కేంద్రాలు కాగా మొదటి రోజు భీమవరం పట్టణంలోని డీఎన్నార్ కళాశాల పరీక్ష కేంద్రంలో మాత్రమే పరీక్ష జరిగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా పరీక్ష నిర్వహించారు. తొలిరోజు పరీక్షకు 220 మంది హాజరు కావాల్సి ఉండగా 23 మంది గైర్హాజరయ్యారు. 197 మంది అభ్యర్థులు 89.54 శాతం పరీక్షకు హాజరైనట్లయ్యింది. ఎటువంటి మాస్ కాపీయింగ్ నమోదు కాలేదని డీఈవో నారాయణ తెలిపారు. ఒక పరీక్ష కేంద్రాన్ని ఒక స్పెషల్ స్క్వాడ్ టీమ్, విజిట్ చేసినట్లు ఆయన తెలిపారు.
భీమవరం డీఎన్నార్ కాలేజీలో పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ నాగ రాణి తనిఖీ చేశారు. జిల్లాలో ఐదు పరీక్ష కేంద్రాలున్నాయని, మొత్తం 16,634 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. జూలై 30 వరకు సుమారు 23 రోజులు మూడు షిఫ్ట్లలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరం, తాగునీటి సౌకర్యాన్ని ఏర్పా టు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. డీఈవో ఇ.నారాయణ, చీఫ్ సూపరింటెండెంట్ తంగిరాల హరి ఆనంద్ ప్రసాద్, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అంజన్కుమార్ తదితరులు ఉన్నారు.