తాగునీరివ్వండి మహాప్రభో..!
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:40 AM
సాగు నీరందక రైతులు గగ్గోలు పెడుతున్న తరుణంలో తాగునీరు లేదని మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.
పోడూరు, జూలై 18(ఆంధ్రజ్యోతి):సాగు నీరందక రైతులు గగ్గోలు పెడుతున్న తరుణంలో తాగునీరు లేదని మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పోడూరు మండలం కవిటం లాకు ప్రాంతంలో నాలుగు రోజులుగా పంచాయతీ తాగునీరు ఇవ్వడం లేదని మహిళలు శుక్రవా రం రోడ్డెక్కారు. మార్టేరు – పాలకొల్లు రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. నాలుగు రోజులుగా కుళాయి నీరు ఇవ్వడం లేదని, తక్షణమే తాగునీరు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అర్ధగంటకు పైగా ధర్నా చేయడంతో రోడుపై వాహనాలు నిలిచిపోయాయి. ఎంపీడీవో మంగాకుమారి, పంచాయితీ కార్యదర్శి కృష్ణవేణి అక్కడికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. వాటర్ ట్యాంక్ క్లీనింగ్, మరమ్మతుల కారణంగా నీరు సరఫరా కాలేదన్నారు. మరమ్మతులు పూర్తి చేసి శనివారం నుంచి యథావిధిగా తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. దీంతో మహిళలు ధర్నా విరమించారు. అనంతరం తక్షణ చర్యలుగా పంచాయతీ సిబ్బంది నాలుగు ట్రాక్టర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేశారు.