Share News

సిమెంట్‌ పూతలు!

ABN , Publish Date - May 10 , 2025 | 12:51 AM

నూజివీడు శివారు కొన్నంగుంట వద్ద నిర్మించిన నెల రోజులకే సిమెంట్‌ కొట్టుకుపోయి రాళ్లు పైకి తేలడంతో హడావుడిగా బిల్లులు కోసం ఇలా పైపైన సిమెంట్‌ పూసి ఎవరూ తొక్కకుండా రాళ్లు, కొబ్బరి బొందలు, తాటిబొందలు అడ్డుపెట్టారు. ఇది చూసిన జనం ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు

సిమెంట్‌ పూతలు!
కొన్నంగుంట వద్ద నెలరోజులకే ధ్వంసమైన సిమెంట్‌రోడ్డును బిల్లుల కోసం పైపైన సిమెంట్‌ పూసిన దృశ్యం

నూజివీడులో నెల రోజులకే ధ్వంసమైన సిమెంట్‌ రోడ్లు

మంత్రిగారి ఇలాకాలో.. బిల్లుల కోసం మసిపూసి మారేడుకాయ చేస్తున్న కాంట్రాక్టర్‌

నూజివీడు, మే 9 (ఆంధ్రజ్యోతి) : ఈ ఫొటోలు చూసి సిమెంట్‌ రహదారి నిర్మిస్తున్నారనుకుంటే పొరబడినట్టే. నూజివీడు శివారు కొన్నంగుంట వద్ద నిర్మించిన నెల రోజులకే సిమెంట్‌ కొట్టుకుపోయి రాళ్లు పైకి తేలడంతో హడావుడిగా బిల్లులు కోసం ఇలా పైపైన సిమెంట్‌ పూసి ఎవరూ తొక్కకుండా రాళ్లు, కొబ్బరి బొందలు, తాటిబొందలు అడ్డుపెట్టారు. ఇది చూసిన జనం ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

నూజి వీడు పట్టణాన్ని మోడల్‌టౌన్‌గా తీర్చిదిద్దుతా నని ఎమ్మెల్యే, మంత్రి కె.పార్థసారథి పలు మార్లు నూజివీడు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ వాగ్ధానం మేరకు నూజివీడు పట్టణంలో పెద్ద చెరువు వద్ద, నూజివీడు శివారు గ్రామ మైన కొత్తూరు – కొన్నంగుంట రహదారిలో కొన్నంగుంట వద్ద తారు రోడ్ల స్థానే సిమెంట్‌ రహదారుల నిర్మాణానికి అనుమతులు సాధిం చారు. ఈ రెండు సిమెంట్‌ రోడ్డుల నిర్మాణా లను ఒకే కాంట్రాక్టర్‌ టెండర్‌ ద్వారా పొందా డు. పట్టణంలో పెద్ద చెరువు వద్ద రూ.80 లక్షల వ్యయంతో 200 మీటర్ల మేరకు సిమెం ట్‌ రోడ్డు, కొన్నంగుంట వద్ద రూ.కోటి వ్యయంతో 500 మీటర్ల వరకు తారు రోడ్డు స్థానంలో సిమెంట్‌ రోడ్డును ఇటీవల నిర్మిం చారు. నిర్మాణం పూర్తయి సుమారు నెల రోజు లైంది. వాహనాల రాకపోకలు ప్రారంభించిన కొద్దిరోజులకే ఈ రెండుచోట్ల పైన సిమెంట్‌ కొట్టుకుపోయి చిప్స్‌ (చిన్న కంకర రాయి) తేలుతూ నిర్మాణంలో డొల్లతనానికి సాక్ష్యంగా నిలిచాయి. దీనిపై ప్రజలు విమర్శలు గుప్పి స్తుండడంతో కొన్నంగుంట వద్ద రాళ్లు తేలిన సిమెంట్‌ రోడ్డుపై సిమెంట్‌పూత పూసి దాన్ని ఎవరూ తొక్కకుండా రాళ్లు, తాటి బొందలు, కొబ్బరి బొందలు అడ్డుగా పెట్టడంతో చూసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

అసలు తనిఖీలు చేశారా?

ఈ రహదారి నిర్మాణాలను పర్యవేక్షించా ల్సిన రోడ్లు, భవనాలశాఖ అధికారులు, పను లు జరిగేటప్పుడు తనిఖీలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారు లు సకాలంలో నిబంధనల ప్రకారం పర్యవేక్షణ జరిపి ఉంటే ప్రజాధనం వృథా కాకుండా ఉండేది. ఇక శాఖకే చెందిన క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఈ రహదారుల నాణ్యతను పరిశీ లించి సంతృప్తికరమైన నివేదిక ఇస్తేనే కాంట్రాక్టర్‌కు తుదిబిల్లు చెల్లిస్తారు. ఇప్పుడు దానికోసమే ఈ కాంట్రాక్టర్‌ పైపైన సిమెంట్‌ పూసి బిల్లులు మంజూరు చేయించుకునే యత్నంలో ఉన్నట్టు సమాచారం. నిర్మించిన నెలరోజులకే నాణ్యత లోపంతో దెబ్బతిన్న ఈ రోడ్ల సమస్యను అధికారులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - May 10 , 2025 | 12:51 AM