రియల్ ఎస్టేట్కు ఊతం
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:53 PM
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనఽధికార లేఅవుట్లలో స్థలాల క్రమబద్ధీకరణకు వెసులు బాటు కల్పించింది.
వైసీపీ హయాంలో కఠిన నిబంధనలు
లేఅవుట్ మొత్తం గుర్తించాలంటూ ఆదేశాలు
వ్యక్తిగత ప్లాట్లకు అనుమతి ఇవ్వని గత ప్రభుత్వం
సడలింపు ఇచ్చిన కూటమి ప్రభుత్వం
ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఉత్తర్వులు
భీమవరం టౌన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనఽధికార లేఅవుట్లలో స్థలాల క్రమబద్ధీకరణకు వెసులు బాటు కల్పించింది. స్థల రిజిస్ర్టేషన్ విలువలో నిర్ణీత రుసుము చెల్లించి క్రమబద్ధీకరించు కునేందుకు అవకాశం ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో విధించిన నిబంధనలను ఎత్తివేసింది. నాన్ లేఅవుట్లో ప్లాట్ కొనుగోలు చేసుకుంటే క్రమ బద్ధీకరణకు గత ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. మొత్తం లేఅవుట్ను గుర్తించాలని మున్సిపాలిటీలకు దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాతే అందులో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించేలా నిబంధన పెట్టింది. ఫలితంగా 2020లో అమలు చేసిన లేఅవుట్ క్రమబద్ధీరణకు దరఖాస్తులు చేసుకోవడానికి అంతా వెనుకంజ వేశారు. ప్రతి మున్సిపాలిటీలోనూ కొద్దిమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వాటిని క్రమబద్ధీకరించలేని పరిస్థితి ఏర్పడింది. దరఖాస్తులు పెండింగ్లో ఉండగానే ఎల్ఎర్ఎస్ గడువు ముగిసిపోయింది. దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభించనుంది. ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పెండింగ్ దరఖాస్తులను ప్రస్తావించింది. వాటిని పరిష్కరించాలని దిశానిర్దేశం చేసింది. అయితే అప్పట్లో నిర్ణీత రుసుం చెల్లించిన వారికే వర్తిస్తుంది. లేదంటే కొత్తగా విధించిన రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
నాన్ లేఅవుట్కు గడువు
ప్రభుత్వం నాన్ లేఅవుట్ అయినా, లేఅవుట్ అయినా సరే ప్లాట్లు క్రమబద్ధీకరణపై గడువు విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2025 జూలై 30 నాటికి ఉన్న లేఅవుట్లనే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అంటే అప్పటికే లేఅవుట్లోని ఒక ప్లాట్ అయినా విక్రయించాలి..అప్పుడే అందులోని ఇతర ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే వెసులు బాటు ఇచ్చింది. లేదంటే ప్రభుత్వం ఇచ్చిన వెసులు బాటు నిబంధనలు వర్తించవు. ఇటీవల కాలంలో పట్టణాల్లో నాన్ లేఅవుట్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. రిజిస్ర్టేషన్లు జరిగిపోతున్నాయి. కొన్నింటిని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నారు. విక్రయాలు జరగడం లేదు. వీటికి మాత్రం ప్రభుత్వం ఇచ్చిన వెసులు బాటు వర్తించే అవకాశం లేదు.
క్రమబద్ధీకరణతో ప్రయోజనాలె న్నో
అనధికార లేఅవుట్లలో ప్లాట్లను క్రమ బద్ధీకరిస్తే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. మున్సి పాలిటీ ఎల్పీ నెంబర్ ఇస్తుంది. నిర్మాణాలకు ప్లాన్లు మంజూరు చేస్తుంది. అప్పుడే బ్యాంకులు కూడా రుణ సౌకర్యాన్ని కల్పిస్తాయి. ప్లాట్ యజమానులకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. నాన్ లేఅవుట్లో నిర్మాణాలు చేపట్టాలంటే ప్లాన్లు లేకపోవడంతో రుణాలు కల్పించలేకపోతున్నారు. నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. రియల్ ఎస్టేట్, నిర్మాణాలు మందగించాయి. గతంలో ప్లాన్లు పెట్టుకున్నాసరే నిర్మాణాలు చేపట్టలేదు. వైసీపీ హయాంలో నేతల దందా, రుబాబుతో నిర్మాణాలను వాయిదా వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అనుమతి పొందిన ప్లాన్లలో నిర్మాణాలు చేపడుతు న్నారు. అంతే తప్ప లేఅవుట్ స్థలాల క్రమ బద్ధీకరణకు, అక్కడ నిర్మాణాలకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో రియల్ ఎస్టేట్కు ఊతమివ్వనుంది.
లే అవుట్లలోనే మేలు
ఇటీవల కాలంలో నాన్ లేఅవుట్లలో కొనుగోలు చేసేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. క్రమ బద్ధీకరించుకోవాలంటే పీనల్ ఛార్జీలు తడిసిమోపె డవుతున్నాయి. అదే లేఅవుట్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. రహదారి, డ్రెయిన్లు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రహదా రులుంటాయి. భవన నిర్మాణానికి అనుమతులు సునాయాసంగా లభిస్తాయి.
పీనల్ ఛార్జీలు ఇలా
చదరపు మీటర్లలో ప్రతి చ.మీటరుకు
100 చ.మీ రూ. 200
100– 300 వరకు రూ. 400
300– 500 వరకు రూ. 600
500 చ.మీ పైన రూ. 750
చదరపు గజాల్లో సబ్ రిజిస్ర్టార్ విలువలో
3000 చ.గజాలు 20 శాతం
3000 నుంచి 5000 30 శాతం
5001 నుంచి 10,000 40 శాతం
10,001 నుంచి 20,000 50 శాతం
20,001 నుంచి 30,000 60 శాతం
30,001 నుంచి 50,000 80 శాతం
50,000 చ.గ పైన 100 శాతం