ఆటో కనిపిస్తే మాయం
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:17 AM
చిన్ననాటి నుంచి విందులు, వినోదాలు, విలాసాలతో జల్సాలకు అలవాటు పడ్డాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మొదట్లో చేతి గడియారాలు, బంగారు ఉంగరాలు దొం గిలించేవాడు. తర్వాత మోటార్ సైకిళ్లు, ఆటోలు అపహ రించడం మొదలుపెట్టాడు.
జల్సాలకు అలవాటుపడి అపహరణ..
వేర్వేరు ప్రాంతాల్లో దొంగతనాలు..
17 లక్షల విలువైన.. పది ఆటోలు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్ : ఏఎస్పీ భీమారావు
భీమవరం క్రైం, జూలై 3(ఆంధ్రజ్యోతి):చిన్ననాటి నుంచి విందులు, వినోదాలు, విలాసాలతో జల్సాలకు అలవాటు పడ్డాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మొదట్లో చేతి గడియారాలు, బంగారు ఉంగరాలు దొం గిలించేవాడు. తర్వాత మోటార్ సైకిళ్లు, ఆటోలు అపహ రించడం మొదలుపెట్టాడు. తాజాగా పది ఆటోలను దొంగిలించి పోలీసులకు చిక్కాడు. గురువారం భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఏఎస్పీ భీమారావు కేసు వివరాలు వెల్లడించారు. భీమవరంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఆటోల దొంగతనాలపై కొందరు పోలీసులను ఆశ్రయించారు. టూ టౌన్ సీఐ జి.కాళీచరణ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక సిబ్బందితో ఈ నెల 2వ తేదీ రాత్రి బైపాస్ రోడ్డులో రాయలం వద్ద తనిఖీలు చేపట్టారు. దొంగతనం చేసిన ఆటోతో అటుగా వస్తున్న మండవల్లి మండలం పెర్కిగూడెంకు చెందిన పరసా నాగరాజును అరెస్ట్ చేశారు. అతను చెప్పిన వివరాల ప్రకారం విశాఖపట్నం దగ్గర సబ్బవరంలో వున్న పోలిశెట్టి గణేశ్ నడుపుతున్న తొమ్మిది ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రూ.17 లక్షలు విలువైన పది ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుతోపాటు గణేశ్ను అరెస్టు చేశారు.
వారు బ్యాటరీలను వదలరు
భీమవరం వన్ టౌన్, టూ టౌన్, కాళ్ల, ఆకివీడు, ఉండి, వీరవాసరం, పాలకోడేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 65 బ్యాటరీలు దొంగిలించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ ఎస్పీ వి.భీమారావు తెలిపారు. వీరవాసరానికి చెందిన కంచర్ల శ్రీరామ్కుమార్ తన మూడు లారీలను కిరాయికి తిప్పుతూ భీమవరం మెంటే వారితోట బైపాస్ రోడ్డులోని లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో రాత్రి పూట పార్క్ చేసేవారు. గత నెల 14న మూడు లారీలకు చెందిన 100 ఏహెచ్ కెపాసిటీ గల ఆరు బ్యాటరీలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించికుపోయినట్లు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన వన్టౌన్ ఎస్ఐ కృష్ణాజీ దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే అండర్ టన్నెల్ వద్ద ముగ్గురు వ్యక్తులు రెండు బైక్లపై ఆరు బ్యాటరీలతో అనుమానాస్పదంగా వెళుతున్న భీమవరానికి చెందిన తీగల నరేంద్ర భవాని, పైలా రాకేష్ (సాయి), యలగడ కోదండ శివసాయి వెంకట సత్యనారాయణలను అదుపులోకి తీసుకుని విచారించగా బ్యాటరీలు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. గత ఆరు నెలలుగా భీమవరం పరిసర ప్రాంతాల్లో రోడ్డు బయటపెట్టిన లారీలు, ఐషర్ వ్యాన్లు, జనరేటర్లు, ట్రాక్టర్లు వద్ద బ్యాటరీలు దొంగతనం చేసినట్లుగా, వాటిని మొమమ్మద్ సిరాజ్కు అమ్ముతున్నట్లుగా తెలిపారు. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మొహమ్మద్ సిరాజ్ వద్దకు వెళ్ళి 59 బ్యాటరీలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. భీమవరం, కాళ్ళ పోలీస్ ఆకివీడు, ఉండి, వీరవాసరం, పాలకోడేరు పోలీసు స్టేషన్ల పరిధిలోని రూ.6 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని నేరాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. డీఎస్పీ జయసూర్య, సీఐలు నాగరాజు, కాళీచరణ్, ఎస్సైలు కృష్ణాజీ, రెహ్మాన్, సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించినట్లు తెలిపారు.
దొంగ దొరికిన తర్వాతే కేసులంటూ
భీమవరం వన్టౌన్, టూ టౌన్ స్టేషన్ల పరిధిలో ఆటోలు, బ్యాటరీల దొంగతనాలపై బాధితులు ఫిర్యా దులు చేసినప్పటికి కేసులు నమోదు చేయడం లేద న్న విమర్శలు వస్తున్నాయి. నిందితులు దొరికి, సొత్తు స్వాధీనం చేసుకున్న తర్వాత కేసులు నమోదు చేస్తు న్నారని చెబుతున్నారు. లేకుంటే పోలీసు హిస్టరీలో ఎక్కువ కేసులు పెండింగ్లో ఉంటే పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగడమే కారణమని ఇలా చేస్తు న్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలోను బైక్ దొంగతనాల కేసుల్లో వాహనాలు రికవరీ చేసి అప్పుడు కేసులు నమోదు చేసినట్టు చెబుతున్నారు.