Share News

అర గంటలో ఆమోదం

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:52 AM

ఏలూరు నగర పాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం మంగళవారం నిస్సారంగా సాగింది. కౌన్సిల్‌కు హాజరైన 36 మంది సభ్యులు నిశ్శబ్ధంగా కూర్చున్నారు. సూప రింటెండెంట్‌ సిరాజుద్దీన్‌ అజెండాలోని 18 అంశాలను ఒక్కొక్కటి చదువుతుంటే అందరూ తలలు ఊపారు.

అర గంటలో ఆమోదం
మాట్లాడుతున్న కో ఆప్షన్‌ సభ్యుడు పెదబాబు

అజెండాలోని 18 అంశాలపైన అభ్యంతరాల్లేవు

ఎలాంటి చర్చా చేపట్టని పాలక, ప్రతిపక్షాలు

రూ.453 కోట్లతో నగర సుందరీకరణ

రూ.291 కోట్లతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు

రూ.49 కోట్లతో రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు

ట్రేడ్‌ లైసెన్సు రుసుం పెంపు : మేయర్‌ నూర్జహాన్‌

ఏలూరు టూ టౌన్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏలూరు నగర పాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం మంగళవారం నిస్సారంగా సాగింది. కౌన్సిల్‌కు హాజరైన 36 మంది సభ్యులు నిశ్శబ్ధంగా కూర్చున్నారు. సూప రింటెండెంట్‌ సిరాజుద్దీన్‌ అజెండాలోని 18 అంశాలను ఒక్కొక్కటి చదువుతుంటే అందరూ తలలు ఊపారు. మేయర్‌ బెల్‌ నొక్కారు. అర గంటలోపే చదవడం, సభ అంగీకరించటం జరిగింది. కౌన్సిల్‌లో మెజారిటీ సభ్యులు టీడీపీ వారే. కొందరు ప్రతిపక్ష సభ్యులు వున్నప్పటికి వారు మాట్లాడలేదు. ఈ అంశాలపై సభ్యులు ముందే మాట్లాడుకుని ఓకే చెప్పడం మినహా సభలో ఏ పాయిం ట్‌పైన కూడా చర్చించలేదు.

నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో సుపరిపాలన అందించాం. నగరాభివృద్ధే ధ్యేయంగా అజెండాలో ప్రవేశ పెట్టిన 18 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించడమే దీనికి నిదర్శనం. షెడ్యూల్‌ కులాల నిర్వాసిత ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయల కల్పనకు కోటి రూపాయలు కేటాయించాం. ఆదాయం పెంచుకునే మార్గంలో ట్రేడ్‌ లైసెన్సుల రుసుమును 33 1/3శాతం పెంచబోతున్నాం. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య కృషితో కార్పొరేషన్‌కు వచ్చిన రూ.453 కోట్లతో నగరాన్ని సుందరీకరిస్తున్నాం. గ్రాంట్లు, జనరల్‌ ఫండ్స్‌ రూ.49 కోట్లతో రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు నిర్మించాం. అమృత్‌ పథకంలో రూ.291 కోట్లతో విలీన గ్రామాలకు తాగు నీరందించడానికి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తాం’ అని అన్నారు. డిప్యూటీ మేయర్‌ పప్పు ఉమామహేశ్వరరావు, కో ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకట రత్నం, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, కార్పోరేటర్లు, నగరపాలక సంస్థ కమిషనర్‌ భానుప్రతాప్‌, అడిషనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, ఎంఈ సురేంద్రబాబు, డీఈలు, ఏఈలు, మేనేజర్‌ మూర్తి పాల్గొన్నారు.

అజెండాలోని అంశాలు

గత కౌన్సిల్‌లో అజెండాలోని పది అంశాలను ధ్రువీకరించారు. 27వ డివిజన్‌ దొండపాడును గ్రామ పంచాయతీగా ఏర్పాటుకు తీర్మానించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కోటి రూపాయలతో సీసీ రోడ్లు

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పెంపు

స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు ఏవీ నారాయణ రాజీనామాకు ఆమోదం

స్ర్టోమ్‌ వాటర్‌ డ్రైనేజీ డీపీఆర్‌ తయారీకి సీఐఎస్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అప్పగింత

స్థానిక సంస్థ ఎన్నికల ఖర్చులకు రూ.80 లక్షలతో ప్రతిపాదనలు

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు 33 1/3 శాతం పెంపు

ఆఫీస్‌ సబార్డినేట్‌ ఎం.కాశీవిశ్వనాధం బదిలీకి ఆమోదం

నగరంలో విలీనమైన వెంకటాపురంలోని వెంచర్లు నగర పాలక సంస్థ స్వాధీనం చేసుకుంటుంది. గ్యాంగ్‌ మజూర్‌ ప్రవీన్‌బాబును బదిలీ

నగరంలో మూడు ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల ఆధునీకరణకు రూ.3 కోట్లతో ప్రతిపాదనలు

పొల్యూషన్‌ స్థాయిలను నివారించడానికి రూ.6 కోట్ల 57 లక్షలు కేటాయింపు

మున్సిపల్‌ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పీఎఫ్‌ చెల్లింపునకు ఆమోదం

తుదిమెళ్లలో పంట బోదే స్థలం కేటాయింపు

హార్టికల్చర్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగ కాలం ఏడాది పొడిగింపు.

నగరంలో విలీనం కాక ముందు ఏడు గ్రామాల్లో బకాయిపడిన రూ.34 కోట్ల కరెంటు బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ఆప్కాస్‌ ఉద్యోగులకు జీతాలు పెంపునకు ఆమోదం.

ప్రత్యేక పంచాయతీగా దొండపాడు

ఏలూరు రూరల్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏలూరు 27వ డివిజన్‌లో దొండపాడును ప్రత్యేక పంచాయతీగా చేస్తూ నగర పాలక సంస్థ కౌన్సిల్‌ తీర్మానించింది. దీంతో దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని దొండపాడు ప్రత్యేక పంచా యతీగా ఆవిర్భవించనుంది. 2020లో ఏలూరు రూర ల్‌ గ్రామాల్లో శనివారపుపేట, సత్రంపాడు, చొదిమెల్ల, తంగెళ్లమూడి, పోణంగి, వెంకటాపురం, కొమరవోలు గ్రామాలను ఏలూరు కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ 2022లో వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది. చొదిమెళ్ల పంచాయతీ పరిధిలోని దొండపాడు, శనివా రపుపేటను 27వ డివిజన్‌ చేశారు. ఈ డివిజన్‌లో కొంత గ్రామంగా, మరికొంత కార్పొరేషన్‌లో వుండడం తో పరిపాలన గందరగోళంగా వుండేది. దీంతో ఈ గ్రామాన్ని కార్పొరేషన్‌ నుంచి తొలగించి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపిం ది. గ్రామంలో 2,700 మంది ఉన్నారు. పంచాయతీ కావడంతో ఇక్కడ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:52 AM