కుమ్ములాట
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:41 AM
ఆకివీడు మునిసిపాలిటీ అధికార పక్ష (వైసీపీ) సభ్యుల కుమ్ములాటతో మాటల యుద్ధం జరిగింది.
కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు : వైస్ చైర్మన్
మైక్ ఇచ్చామని ఇష్టానుసారం మాట్లాడొద్దు : చైర్పర్సన్
ఆకివీడు మునిసిపల్ సమావేశంలో వైసీపీ సభ్యుల వాగ్వాదం
ఆకివీడు మునిసిపాలిటీ అధికార పక్ష (వైసీపీ) సభ్యుల కుమ్ములాటతో మాటల యుద్ధం జరిగింది. అధికారులు కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని వైస్ చైర్మన్ విరుచుకుపడితే.. మైక్ ఇచ్చాం కదా అని ఇష్టానుసారం మాట్లాడొద్దు అంటూ చైర్పర్సన్ హెచ్చరించారు. అభ్యంతరకరంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని ఘాటుగా స్పందించారు.
ఆకివీడు, జూలై 31(ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీ సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది. డంపింగ్యార్డు విషయంలో తనను ఏమైనా అంటే ఊరుకోను, అధికారులు, తదితరులు కనీస జ్ఞానం లేకుం డా మాట్లాడుతున్నారని వైసీపీ వైస్ చైర్మన్ పుప్పాల పండు విరుచు కుపడ్డారు. చైర్పర్సన్ జామి హైమావతి జోక్యం చేసుకుని కౌన్సిల్ సమావేశంలో ఏకవచనంతో ఇష్టానుసారం మాట్లాడితే కుదరదని, మీకేమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలన్నారు. చైర్పర్సన్కు తోడు విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ గేదెల అప్పారావు వైస్ చైర్మన్ పండు తీరుపై అభ్యంతరం తెలిపారు. మరోసారి అభ్యంతరకరంగా మాట్లాడితే చర్యలు ఉంటాయని హైమావతి హెచ్చరించారు. గత ప్రభుత్వాల నుంచే సిద్ధాపురం రోడ్డులో డంపింగ్యార్డు ఉందని, మన పాలకవర్గం ఏర్పాటు చేయాలేదన్నారు. మైకు ఇస్తున్నాం కదా అని ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు, కౌన్సిలర్లు సమస్యలపై మాట్లాడాలని చురకలంటించారు.
నిధుల కేటాయింపులో వివక్ష
నగర పంచాయతీలో 20 వార్డులుంటే వైసీపీకి కౌన్సిలర్ల వార్డులకే లక్షల్లో నిధులు కేటాయిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్ బత్తుల శ్యామల ధ్వజమెత్తారు. తమను వార్డు ప్రజలు ఓట్లేసి గెలిపించారని, పన్నులు కట్టించుకుంటున్నాం కదా.. మిగిలిన వార్డులతో సమానంగా నిధులు ఎందుకు కేటాయించరని నిలదీశారు. నగర పంచాయతీ ఏర్పడి నాలుగేళ్లు గడిచినా అభివృద్ధి శూన్యమన్నారు. పంచాయతీగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగేదన్నారు. తాగునీరు, రహదారులు, వీధిలైట్లు, డ్రెయినేజీ, డంపింగ్యార్డు తదితర సమస్యలు కోకొల్లలుగా ఉన్నా పాలకవర్గం, అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే కమిషనర్ కృష్ణమోహన్ ఏదేదో చెబుతారంటూ కౌన్సిలర్లు శ్యామల, మోపిదేవి సత్యవతి సమావేశం నుంచి వెళ్లిపోయారు.
సమస్యలు పట్టించుకోరే..?
పట్టణ సమస్యలపై పట్టించుకోవడం లేదని అధికార పక్షమైన వైసీపీ సభ్యులే సమావేశంలో ఆరోపించారు. ఇండ్ల స్థలాల లేఅవుట్ చేసుకొనే అంశం, శ్మశాన వాటికలు శుభ్రపరచాలని, పట్టణంలోని పలు సమస్యలు అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులను కోరితే పట్టించుకోవడం లేదని వైసీపీ కౌన్సిలర్లు నిమ్మల నాగు, మోటుపల్లి కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కౌన్సిలర్లు గోపిశెట్టి వెంకట సత్యవతి, గుర్రాని నాగలక్ష్మి, నేరెళ్ల ప్రసన్న తమ వార్డులలో సమస్యలు పరిష్కరించడంలేదన్నారు. వైసీపీ కౌన్సిలర్ల అంతర్గత కుమ్ములాటతో కౌన్సిల్ సమావేశంలో అజెండా సమస్యలు చర్చించకుండానే కౌన్సిలర్లు వెళ్లిపోయారు. చేసేదిలేక అధికారులు సమావేశం ముగించారు.