మూడూ టీడీపీకే..
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:34 AM
జిల్లాలోని మూడు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఏఎంసీ చైర్మన్ల నియామకం
భీమవరానికి సుజాత
నరసాపురానికి శ్రీమన్నారాయణ
పెనుగొండకు వీరబ్రహ్మం
పెండింగ్లో ఆచంట
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని మూడు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. భీమవరం, నరసాపురం, పెనుగొండ ఏఎంసీలు మూడింటిని టీడీపీకే కేటాయించారు. జిల్లాలో మొత్తం పది ఏఎంసీలకుగాను ఇప్పటి వరకు తొమ్మిది మంది చైర్మన్లను ఎంపిక చేశారు. ఆచంట ఒక్కటే పెండింగ్ లో వుంది. జనసేనకు చెందిన పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) ప్రాతినిధ్యం వహిస్తున్న భీమవరంలో ఏఎంసీ చైర్మన్గా టీడీపీ సీనియర్ నేత కలిదిండి రామచంద్రరాజు భార్య సుజాతను నియమించారు. వీరు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలోనే కొనసాగుతున్నారు. జనసేన ఎమ్మెల్యే నాయకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపు రంలో ఏఎంసీ చైర్మన్గా జక్కం శ్రీమన్నారాయణ నియ మితులయ్యారు. ఆయన టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆచంట టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పరిధిలోని పెనుగొండ ఏఎంసీకి చైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత బడేటి వీరబ్రహ్మంను నియ మించింది. అయితే తాడేపల్లిగూడెం, ఉండి ఏఎంసీలకు జనసేనకు చెందిన చాపల రమేష్, జుత్తిగ నాగరాజును ప్రకటించినప్పటికి ఇప్పటి వరకు ఉత్తర్వులు వెలువడక పోవడం గమనార్హం. భీమవరం, ఆకివీడు, నర్సాపురం, పాలకొల్లు, పెనుగొండ, అత్తిలి, తణుకు ఏఎంసీ చైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీకి కేటాయించినట్లు అయ్యింది.