ఆడుదాం ఆంధ్ర పోటీలపై విజిలెన్స్ విచారణ
ABN , Publish Date - May 17 , 2025 | 12:26 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్)లో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. రూ.130 కోట్లు ఖర్చు చేసి చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’తో పాటు ఇతర కార్యక్రమాలకు సంబంధించి చేసిన వ్యయంపైనా ఆరా తీస్తోంది.
ఏలూరు రూరల్, మే 16 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్)లో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. రూ.130 కోట్లు ఖర్చు చేసి చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’తో పాటు ఇతర కార్యక్రమాలకు సంబంధించి చేసిన వ్యయంపైనా ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏలూరు ఎంపీడీవో కార్యాలయం, ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి సచివాలయంలో ఆడుదాం ఆంరఽధ పోటీల్లో మండల స్థాయిలో చేసిన చెల్లిం పులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆడుదాం ఆంరఽధ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు భోజన సదుపాయాలు తదితర అంశాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ క్రీడా పోటీలు ఏలూరు జిల్లాలోను జరిగాయి. ఇదే సమయంలో సచివాలయ పరిధిలో ఔత్సాహిక క్రీడాకారులను ఎంపిక చేసి క్రీడా పరికరాలతో కూడిన కిట్లను వారికి పంపిణీ చేశారు. ఆ పరికరాలు జిల్లా క్రీడాభివృద్ధి శాఖకు అందించగా వాటిని గ్రామ, వార్డు, పట్టణ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేశారు. ఈ కిట్లో క్రికెట్ బ్యాట్, చేతులకు, కాళ్లకు ధరిం చే రక్షణ పరికరాలు, టెన్నిస్ ర్యాకెట్లు, కప్లు ఇలా ఏడు రకాల క్రీడలకు సంబంధించిన పరికరాలను పంపిణీ చేశారు. అయితే వీటిలో ఎక్కువగా ఆకర్షించినవి
క్రికెట్ బ్యాట్లు. ఎక్కువ మంది క్రీడాకారులకు ఈ కిట్లు పంపిణీ చేశారు. అయితే తొలిరోజే ఈ బ్యాట్లు తొలి మ్యాచ్లోనే విరిగిపోవడం సంచలనం కలిగించింది. క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరిగిపోయిన బ్యాట్లను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ చేశారు. ఇదిలా ఉండగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి సంబంధించిన కిట్లు తయారీని రాష్ట్రానికి చెందిన ఒక సంస్థకు టెండర్ను కట్టబెట్టారు. అయితే అప్పట్లోనే ఈ సంస్థపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ శాప్ ఆ కంపెనీకే టెండర్ ఇచ్చేసింది. కోట్లు రూపాయల విలువైన క్రీడా పరికరాలు కొనుగోలులోను అవినీతి జరిగినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. క్రీడాకారులకు అందించే ట్రోపీలు, భోజన సదుపాయం ఇతర అంశాల్లోను అవినీతి జరిగిందని గుర్తించింది. ఈ క్రమంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ ప్రారంభించారు.