The students questioned : ప్లాస్టిక్ను వాడొద్దన్నారు కదా?
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:43 AM
The students questioned :‘ప్లాస్టిక్ను వాడొద్దని ప్రభుత్వం చెబుతుంది కదా. మరి మీ కోసం తాగేందుకు ప్లాస్టిక్ బాటిళ్లతో నీరు, ప్లాస్టిక్ ఫైళ్లతో కూడిన పేపర్లను టేబుల్పై ఎందుకు పెట్టారు.’ అని విద్యార్థినులు జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్బాబును ప్రశ్నించారు.
- ఎందుకు టేబుల్పై ప్లాస్టిక్ బాటిళ్లు, ఫైళ్లు పెట్టారు
- జిల్లా ప్రత్యేక అధికారిని ప్రశ్నించిన విద్యార్థులు
శృంగవరపుకోట, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ‘ప్లాస్టిక్ను వాడొద్దని ప్రభుత్వం చెబుతుంది కదా. మరి మీ కోసం తాగేందుకు ప్లాస్టిక్ బాటిళ్లతో నీరు, ప్లాస్టిక్ ఫైళ్లతో కూడిన పేపర్లను టేబుల్పై ఎందుకు పెట్టారు.’ అని విద్యార్థినులు జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్బాబును ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం శృంగవరపుకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్బాబు హాజరయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం గురించి ఇంగ్లీష్లో మాట్లాడాలని విద్యార్థులకు ప్రత్యేకాధికారి సూచించారు. దీంతో తొమ్మిదో తరగతి విద్యార్థినులు పూర్ణిమ, నీలిమ మాట్లాడుతూ.. ప్లాస్టిక్, ఎలకా్ట్రనిక్ వ్యర్థాలను ఎక్కడికక్కడే విసిరేస్తుండడంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ఇ-వ్యర్థాలతో ప్రజలు క్యాన్సర్ వంటి పలు రకాల రుగ్మతల బారిన పడుతున్నారని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఇదే సమయంలో ప్లాస్టిక్ బాటిళ్లతో తాగునీరు, కాగితాలతో కూడిన ప్లాస్టిక్ ఫైళ్లను స్థానిక అధికారులు టేబుల్పై పెట్టారు. వీటిని చూసిన విద్యార్థినులు పూర్ణిమ, నీలిమ.. ఇవే కదా ఇ-వ్యర్థాలు అని అన్నారు. ప్లాస్టిక్ను వాడొద్దని అన్నారు కదా అని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతారని విద్యార్థులను ఆయన అభినందించారు. ఇ-వ్యర్థాలుగా మారే ప్లాస్టిక్ వస్తువులు సమావేశాల్లో లేకుండా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించారు.