ఖరీఫ్నకు సాగునీరు అందేనా?
ABN , Publish Date - May 21 , 2025 | 12:09 AM
జంఝావతి ప్రాజెక్టు రబ్బర్ డ్యామ్ వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురై ఏడాది అవుతున్నా ఇంకా దాన్ని బాగు చేయలేదు.
- జంఝావతి రబ్బర్ డ్యామ్ వద్ద మరమ్మతులకు గురైన ట్రాన్స్ఫార్మర్
-ఏడాదైనా బాగుచేయని వైనం
-రైతుల్లో ఆందోళన
పార్వతీపురం, మే 20 (ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు రబ్బర్ డ్యామ్ వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురై ఏడాది అవుతున్నా ఇంకా దాన్ని బాగు చేయలేదు. దీంతో ఈ ఖరీఫ్నకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందుతుందా? లేదా? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. జంఝావతి రబ్బర్ డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాజ్యలక్ష్మీపురం, కందివలస, రావికర్రివలస తదితర గ్రామాల్లోని 600 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. గత ఖరీఫ్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ట్రాన్స్ఫార్మర్ పాడైంది. దీంతో మోటార్ల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులు పలుమార్లు విన్నవించడంతో జంఝావతి అధికారులు ట్రాన్స్ఫార్మర్ను విశాఖపట్నంలోని ఓ వర్క్షాప్నకు తరలించారు. అయితే, ఏడాది అవుతున్నా ఇంకా దాన్ని బాగు చేయలేదు. కొత్తదైనా బిగించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ట్రాన్స్ఫార్మర్ లేకపోవడంతో ఏడాదిగా మోటార్లను వినియోగించడం లేదు. దీనివల్ల మోటార్లు కూడా మరమ్మతులకు గురయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ప్రసాద్కు రైతులు వినతిపత్రం అందించారు. గత ఏడాది సాగునీరు అందక పంటలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ జంఝావతి, ఏపీ ట్రాన్స్కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ను ఎందుకు బాగుచేయలేదని వారిని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుందని, తక్షణం సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
సాగునీరు అందలేదు
గత ఏడాది ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురవడంతో మోటార్ల ద్వారా సాగునీరు అందలేదు. పొట్ట దశలో వరి ఎండిపోయింది. ఈసంవత్సరం ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలి. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. వెంటనే ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తామని హామీఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది.
-సత్యం, రైతు, రావికర్రివలస