Bogus Pensions? బోగస్ పింఛన్లకు బ్రేక్ పడేనా?
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:54 PM
Will There Be a Break on Bogus Pensions? జిల్లాలో బోగస్ పింఛన్లకు బ్రేక్ పడేనా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ధ్రువపత్రాలు మంజూరు చేసిన వారికి.. వాటి ఆధారంగా అడ్డదారుల్లో పింఛన్లు పొందిన వారిపై చర్యలు ఇంకెప్పుడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వారిపై ఫిర్యాదుల వెల్లువ
దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం
కొనసాగుతున్న వైద్య తనిఖీలు
అర్హులకు న్యాయం చేయాలని జిల్లావాసుల విన్నపం
పార్వతీపురం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బోగస్ పింఛన్లకు బ్రేక్ పడేనా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ధ్రువపత్రాలు మంజూరు చేసిన వారికి.. వాటి ఆధారంగా అడ్డదారుల్లో పింఛన్లు పొందిన వారిపై చర్యలు ఇంకెప్పుడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తోంది. ఒక పక్క అభివృద్ధి.. మరో పక్క సంక్షేమం పథకాలు అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక పింఛను సొమ్ము రూ.3 వేలు నుంచి రూ.4 వేలకు పెంచింది. అదే విధంగా దివ్యాంగులకు మూడు విభాగాలుగా పింఛన్లు అందిస్తోంది. దివ్యాంగులకు రూ.6 వేలు.. కండరాల బలహీనత, పక్షవాతం తదితర రుగ్మతలతో బాధపడుతున్నవారికి రూ.10 వేలు, దీర్ఘకాలిక వ్యాధులకు గురై మంచం పట్టిన వారికి రూ.15 వేలకు పింఛను మొత్తాన్ని పెంచి అందిస్తోంది. అయితే బోగస్ పింఛన్లకు మాత్రం బ్రేక్ పడలేదు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో బోగస్ దివ్యాంగ పింఛన్లకు అడ్డుకట్ట పడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల సామాజిక పింఛన్దారులు 1.42 లక్షల మంది వరకూ ఉన్నారు. వారి కోసం ప్రతినెలా ప్రభుత్వం రూ. 59.19 కోట్లు విడుదల చేస్తోంది. కాగా లబ్ధిదారుల్లో 16,468 మంది దివ్యాంగ పింఛన్దారులు ఉన్నారు. వారికి ప్రతినెలా రూ.10.12 కోట్ల పింఛన్ల రూపంలో అందిస్తోంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది అనర్హులు తప్పుడు ధ్రువపత్రాలతో పింఛన్లు పొందారు. అప్పటి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కొందరు ప్రజాప్రతినిధుల అధికారి యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొచ్చి పింఛన్లు మంజూరు చేయించారు. టీడీపీ అభిమానులు, కార్యకర్తలుగా ముద్ర పడిన వారికి అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు ఇవ్వలేదు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హులైన పింఛన్దారులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కారు నాలుగు ప్రత్యేక వైద్యాధికారుల బృందాన్ని నియమించింది. ఆసుపత్రుల్లో శిబిరాలను నిర్వహించి ఈ ఏడాది జనవరి నుంచి దివ్యాంగ పింఛన్దారుల తనిఖీ ప్రక్రియ చేపట్టింది. మొదటి బృందానికి బలిజిపేట, సీతానగరం, గరుగుబిల్లి, పార్వతీపురం మండలాలు, రెండో బృందానికి పార్వతీపురం పట్టణం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాలు, మూడో బృందానికి కురుపాం, భామిని, వీరఘట్టాం మండలాలు, నాలుగో బృందానికి పాలకొండ, సాలూరు అర్బన్, సాలూరు మండలాల్లో తనిఖీలకు వైద్యులను నియమించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు ప్రొఫెసర్లు , వైద్యులను నియమించారు. మొదట మంచానికి పరిమితమైన వారితో పాటు డయాలసిస్, ఇతర సమస్యలతో సతమతమయ్యే వారిని పరిశీలించారు. వీరు రూ. 15 వేలు పింఛను పొందుతున్నారు. జనవరి 23 నుంచి జూలై నెలాఖరు వరకు వరకు తనిఖీలకు సమయం కేటాయించారు. రోజుకు 10 నుంచి 20 మందికిపైగా వైద్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూ. 6 వేలు పొందుతున్న దివ్యాంగులు జిల్లాలో 7,924 మందికి పైగా ఉన్నారు. కాగా దర్జాగా పింఛన్లు పొందుతున్న బోగస్ పింఛన్దారులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. బోగస్ పింఛన్లు ఏరివేసి అర్హులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
జూలై నెలాఖరుకు పూర్తి..
పింఛన్ల తనిఖీ ప్రక్రియ జరుగుతుంది. సామాజిక పింఛన్లు పొందుతున్న కొంతమంది దివ్యాంగులకు విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రిలో సదరం తనిఖీలు చేపడుతున్నాం. జూలై నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మరికొందరికీ నోటీసులు ఇచ్చినా తనిఖీలకు హాజరు కాలేదు. వారికి మళ్లీ నోటీసులిచ్చాం.
- సుధారాణి, పీడీ, డీఆర్డీఏ, పార్వతీపురం మన్యం