Share News

Will the Suspense End? ఉత్కంఠకు తెరపడేనా?

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:26 PM

Will the Suspense End? పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ ఎన్నిక సోమవారం నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్సీ రిజర్వ్‌కు కేటాయించిన చైర్‌పర్సన్‌ ఎన్నిక ఇప్పటికే రెండుసార్లు కోరం లేక వాయిదా పడింది. వైసీపీ, కూటమి సభ్యులు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈసారైనా ఉత్కంఠకు తెరపడేనా? అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Will the Suspense End? ఉత్కంఠకు తెరపడేనా?
పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం

పాలకొండ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ ఎన్నిక సోమవారం నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్సీ రిజర్వ్‌కు కేటాయించిన చైర్‌పర్సన్‌ ఎన్నిక ఇప్పటికే రెండుసార్లు కోరం లేక వాయిదా పడింది. వైసీపీ, కూటమి సభ్యులు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈసారైనా ఉత్కంఠకు తెరపడేనా? అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పట్టణంలో 20 వార్డులున్నాయి. కాగా 19వ వార్డుకు చెందిన యందవ రాధాకుమారి వ్యక్తిగత కారణాలతో చైర్‌పర్సన్‌ పదవికి గత ఏడాది డిసెంబరులో రాజీనామా చేశారు. అప్పటి నుంచి వైస్‌ చైర్మన్‌-2 పల్లా ప్రతాప్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే రెండో వార్డుకు చెందిన ఆకుల మల్లీశ్వరికి ఈ పదవి వరించాల్సి ఉండగా.. గతంలో చైర్‌పర్సన్‌ ఎన్నికకు ముందు ఆమె వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో వైసీపీ అధిష్ఠానం విప్‌ జారీ చేసింది. ఈ మేరకు సంఖ్యా బలం ఉన్న వైసీపీ కౌన్సిలర్లు రెండు సార్లు చైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రక్రియను వ్యతిరేకించారు. రెండు నోటిఫికేషన్ల సమయంలో నిర్వహించిన నాలుగు సమావేశాలకు వారు హాజరుకాలేదు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. నేడు మూడో సారి ఎన్నిక ప్రక్రియ జరగ్గా.. వైసీపీ, కూటమి కౌన్సిలర్లు ఎవరికి వారు కసరత్తులు పూర్తి చేశారు.. ఈసారైనా కౌన్సిలర్లంతా ఏకతాటిపైకి వచ్చి చైర్‌పర్సన్‌ ఎన్నుకుంటారా? లేక ఎవరి పంథాలో వారు వెళ్లి ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటారో? వేచి చూడాల్సి ఉంది. కాగా పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కమిషనర్‌ రత్నంరాజు తెలిపారు.

Updated Date - Apr 27 , 2025 | 11:26 PM