Get Back on Track? గాడిలో పడేనా?
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:11 PM
Will It Get Back on Track? గత వైసీపీ సర్కారు కాలంలో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వాటిని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా సచివాలయాలకు ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యేక పర్యవేక్షణ అధికారుల నియామకం
కొన్ని మండలాల్లో ఇంకా విధుల్లో చేరని వైనం
పార్వతీపురం, డిసెంబరు6(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు కాలంలో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వాటిని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా సచివాలయాలకు ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారితో పాటు జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్తో సహా ఇద్దరు ఫంక్షనరీ సిబ్బందిని నియమించి సచివాలయాల పర్యవేక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని 15 మండలాల్లో 312 గ్రామ సచివాలయాలున్నాయి. పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 38 సచివాలయాలున్నాయి. పార్వతీపురం, సాలూరుకు రెవెన్యూ ఆఫీసర్ క్యాడర్లో ఉన్న అధికారులతో పాటు సిబ్బందిని నియమించారు. పాలకొండలో సచివాలయాలకు ఇంకా పర్యవేక్షణ అధికారులను నియమించలేదు. మరోవైపు జిల్లాలో 15 మండలాలకు 15 మంది పర్యవేక్షణ అధికారులను నియమించారు.
నియామకమైన అధికారులు వీరే..
పార్వతీపురానికి రోబెన్, సాలూరు మునిసిపాలిటీకి పి.ప్రసాద్ నియామకమయ్యారు. గుమ్మ లక్ష్మీపురానికి ఎం.వాసుదేవరావు, సీతంపేటకు కె.మోహన్బాబు, కురుపాంకు ఎన్.శ్రీనివాసరావు, మక్కువకు ఎం.ఫణిభూషణ్, పాలకొండకు ఎస్.అడవిరాముడు, సీతానగరంకు ఎం.శివప్రసాద్ నియామకయ్యారు. కొమరాడకు ఆర్.ప్రభాకర్, సాలూరుకు కె.వి.సాయిరాం, బలిజిపేటకు పి.వెంక టరావు, పాచిపెంటకు సి.హెచ్.వాసు ప్రకాశరావు, వీరఘట్టానికి ఎస్.శాంతారావు, జియ్యమ్మ వలసకు పి.శ్రీనివాసరాజు, భామినికి ఎం.శ్రీనివాసరావు, గరుగుబిల్లికి బి.హరినారాయణ పార్వతీపురానికి ఎం.వెంకటేశ్వర శర్మ నియామకమయ్యారు. ఇందులో గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో సచివాలయాలకు నియా మకమైన ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు ఇంకా విధుల్లో చేరలేదు. మిగిలిన మండలాల్లో నియామకమైన అధికారులు ఈ నెల 5న విధుల్లో చేరారు. అయితే ఇప్పటికైనా జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు మారుతుందని , సకాలంలో సేవలందుతాయని జిల్లావాసులు ఆశిస్తున్నారు.