why the situatiobn is bad పెద్ద చెరువు ఎందుకిలా?
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:11 AM
why the situatiobn is bad నగరానికి తలమానికమైన పెద్దచెరువు దుర్గంధం వెదజల్లుతోంది. నిన్నటివరకూ ఎంతో ఆహ్లాదకరంగా, పర్యాటకులకు ఆటవిడుపుగా ఉన్న పెద్దచెరువు నేడు కంపుకొడుతోంది. మృత చేపలు అధికంగా పేరుకుపోవడంతో అటువైపుగా వెళ్లాలంటేనే ముక్కు మూసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పెద్ద చెరువు ఎందుకిలా?
చనిపోతున్న మత్స్యసంపద
సమీప ప్రాంతాల్లో దుర్వాసన
ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు
నగరానికి తలమానికమైన పెద్దచెరువు దుర్గంధం వెదజల్లుతోంది. నిన్నటివరకూ ఎంతో ఆహ్లాదకరంగా, పర్యాటకులకు ఆటవిడుపుగా ఉన్న పెద్దచెరువు నేడు కంపుకొడుతోంది. మృత చేపలు అధికంగా పేరుకుపోవడంతో అటువైపుగా వెళ్లాలంటేనే ముక్కు మూసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
విజయనగరం టౌన్, డిసెంబరు7(ఆంధ్రజ్యోతి):
విజయనగరం అంటేనే అందరికీ పెద్దచెరువు గుర్తుకువస్తుంది. ఇక్కడి ప్రజల నాగరికతతో ఆ చెరువుకు అవినాభావ సంబంధం ఉంది. అంతటి ముఖ్యమైన చెరువులో కొద్దిరోజులుగా వేలాదిగా చేపలు మృత్యువాతపడుతున్నాయి. దీంతో అటుగా వెళ్లేవారికి, ఆ ప్రాంతం వాసులకు చెడు వాసన వస్తోంది. బాలాజీ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపం వరకూ సుమారు కిలోమీటరు పొడవునా చెరువు ఒడ్డున మృత చేపలు చేరాయి. ట్యాంక్బండ్ రహదారి గుండా వెళ్లే వాహనదారులు ముక్కు మూసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. పెద్దచెరువు చుట్టూ షాపింగ్మాల్స్తో పాటు, గృహ సముదాయాలున్నాయి. ఈదుర్గంధం భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో ఉండే బోరులోకి కూడా ఆ నీరు ఇంకి రోగాల పాలవుతామేమోనని భయపడుతున్నారు.
బోసిపోయిన ఆచంట గార్డెన్
చెరువు దక్షిణ గట్టుపై ఏర్పాటుచేసిన ఆచంట గార్డెన్ నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. నగరవాసులతో పాటు వాకర్స్, విద్యార్థులు, వృద్ధులు అంతా ఈ గార్డెన్కు చేరుకుని ఆహ్లాదం పొందుతారు. అయితే చేపలు చనిపోవడంతో వచ్చిన దుర్గంధం వల్ల ఆదివారం ఒక్కరూ కూడా గార్డెన్కు రాకపోవడం గమనార్హం. పర్యాటకులు లేక ఆచంట గార్డెన్ బోసిపోయింది.
మూడు ట్రాక్టర్లను పెట్టాం
చెరువులో చేపలు చనిపోవడంతో దుర్గంధం వెదజల్లడం వాస్తవమే. నీటిపారుదల శాఖ అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలి. కార్పొరేషన్ తరుపున మూడు ట్రాక్టర్లను ఏర్పాటు చేసి చేపలను తొలగిస్తున్నాం.
- పి.నల్లనయ్య, కమిషనర్, విజయనగరం