Why did you stop? ఎందుకు ఆపినట్టో?
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:11 AM
Why did you stop? ఏపీపీఎస్సీ ఈనెల 15 నుంచి 23 వరకు (19మినహా) ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల(లెక్చరర్) ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహించనుంది. వీటితో పాటు జరగాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు చెందిన డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు (లెక్చరర్) ఉద్యోగ నియామక పరీక్షలను మాత్రం ఏపీపీఎస్పీ పరిపాలన పరమైన కారణాలంటూ వాయిదా వేసేసింది. దీంతో టీటీడీ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న యువతీయువకులు ఉసూరుమంటున్నారు.
ఎందుకు ఆపినట్టో?
టీటీడీ డిగ్రీ, జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టుల నియామక పరీక్ష వాయిదా
తొలుత షెడ్యూల్ను విడుదల చేసిన ఏపీపీఎస్సీ
తర్వాత తొలగించిన వైనం
రెండుసార్లు వాయిదా పడడంతో నిరుద్యోగుల్లో అనుమానాలు
శృంగవరపుకోట, జూలై 14 (ఆంధ్రజ్యోతి):
ఏపీపీఎస్సీ ఈనెల 15 నుంచి 23 వరకు (19మినహా) ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల(లెక్చరర్) ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహించనుంది. వీటితో పాటు జరగాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు చెందిన డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు (లెక్చరర్) ఉద్యోగ నియామక పరీక్షలను మాత్రం ఏపీపీఎస్పీ పరిపాలన పరమైన కారణాలంటూ వాయిదా వేసేసింది. దీంతో టీటీడీ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న యువతీయువకులు ఉసూరుమంటున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఓట్లకు గాలం వేయాలని చూసి 2024 సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చింది. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపాదికన అధ్యాపకులను నియమిస్తామని పేర్కొంది. వీటితో పాటు 2023 డిసెంబర్ 31న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు చెందిన డిగ్రీ కళాశాల, ఓరియంటల్ కళాశాలలు, జూనియర్ కళాశాలల్లో కూడా శాశ్వత ప్రాతిపాదికన అధ్యాపకుల(లెక్చరర్) భర్తీకి నోటీఫికేషన్ను ఇచ్చింది.
నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాలివీ
టీటీడీ డిగ్రీ, ఓరియంటల్ కళాశాలల్లో బోటనీ 3, కెమిస్ట్రీ 2, కామర్స్ 9, డెయిరీ సైన్స్ 1, ఎలకా్ట్రనిక్స్ 1, ఇంగ్లీష్ 8, హిందీ 2, హిస్టరీ 1, హోమ్సైన్స్ 4, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, ఫిజిక్స్ 2, పాపులేషన్ స్టడీస్ 1, సాంస్కృత్1, సాంస్కృత్ వ్యాకరణ 1, స్టాటిస్టిక్స్ 4, తెలుగు 3, జువాలజీ 4 మొత్తం 49 అధ్యాపక ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే జూనియర్ కళాశాలల్లో బోటనీ 4, కెమిస్ట్రీ 4, సివిక్స్ 4, కామర్స్ 2, ఇంగ్లీష్ 1, హిందీ 1, హిస్టరీ 4, మేధమెటిక్స్ 2, ఫిజిక్స్ 2, తెలుగు 3, జువాలజీ 2 కలిపి మొత్తం 29 అధ్యాపక నియామకాలను ప్రకటించారు. డిగ్రీ కళాశాల ఆధ్యాపక ఉద్యోగానికి జీతం రూ.61,960-రూ.1,51,370, జూనియర్ కళాశాల అధ్యాపక ఉద్యోగానికి రూ.57,100-రూ.1.47,760 పేర్కొనడంతో అర్హత ఉన్న నిరుద్యోగ యువత మొగ్గు చూపింది. 2024 మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఉద్యోగ నియామక పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదావేసింది.
వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగ నియామకాలకు కూటమి ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్ కళాశాల అధ్యాపక నియామకాలతో పాటు టీటీడీ డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపక నియమాకాలకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సమాయత్తమైంది. ఇందుకు తొలుత జూన్ 16 నుంచి జూన్ 26 వరకు పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది. ఆ సమయంలో ఉపాధ్యాయ నియామక డీఎస్సీ జరుగుతుండడంతో షెడ్యూల్ను వాయిదా వేసింది. తిరిగి నెలరోజుల వ్యవధిలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ను ప్రకటించడంతో ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్ కళాశాల అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నవారితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేసింది.
- టీటీడీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్కు చెందిన హిందువులు మాత్రమే అర్హులు. మిగిలిన మతాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండదు. దీంతో పోటీతత్వం తక్కువగా ఉంటుంది. కానీ ఏపీపీఎస్సీ టీటీడీ కళాశాలల అధ్యాపక ఉద్యోగ పరీక్షలను మాత్రమే వాయిదా వేసింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని ఇటు టీటీడీ, ఏపీపీఎస్సీ కూడా చెప్పడం లేదు. వీటిని భర్తీ చేస్తారో లేదోనన్న స్పష్టత లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
---------------