నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా..
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:08 AM
వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి రిక్షాతో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు.
బొండపల్లి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి రిక్షాతో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. దీనిపై ఎస్ఐ యు.మహేష్ శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సీర నాగరాజు(42) రిక్షా పుల్లర్గా జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి ఆయన తన రిక్షాపై వినాయక నిమజ్జ నానికి పోలీసుస్టేషన్ సమీపంలో ఉన్న రామన్న చెరువుకు వెళ్లారు. తిరిగి రిక్షాలో స్వగ్రామం వెళ్తుండగా బొండపల్లి పోలీసు స్టేషన్కు సమీపంలోకి వచ్చేసరికి గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రున్ని 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం మృతిచెందారు. మృతునికి భార్య గౌరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.