What are loans for tenant farmers? కౌలు రైతులకు రుణాలేవి?
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:35 AM
What are loans for tenant farmers? అర్హులైన ప్రతికౌలు రైతుకూ రుణాలు అందించాలని ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయమై ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ అంబేడ్కర్ కూడా ఆదేశించారు. అయినా వారికి రుణాల మంజూరులో బ్యాంకర్లు ముందడుగు వేయడం లేదు.
కౌలు రైతులకు రుణాలేవి?
జిల్లా వ్యాప్తంగా 16 వేల మంది అర్హులు
రూ.140 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యం
ఇప్పటి వరకూ రూ.72 లక్షలే అందజేత
కౌలు రైతులకు రుణాలు అందడం లేదు. అధికారుల లక్ష్యం ఒకలా.. బ్యాంకర్ల స్పందన మరోలా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈసారి రూ 140 కోట్ల రుణాలను అందించాలని జిల్లా అధికారులు నిర్దేశించారు. ఖరీఫ్ సీజన్ మొదలై రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ రూ.72 లక్షలే మంజూరు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అధికారులు ఎన్ని ఆదేశాలు జారీ చేస్తున్నా ఆచరణలో ముందడుగు పడడం లేదు.
విజయనగరం కలెక్టరేట్, జూలై 27(ఆంధ్రజ్యోతి):
అర్హులైన ప్రతికౌలు రైతుకూ రుణాలు అందించాలని ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయమై ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ అంబేడ్కర్ కూడా ఆదేశించారు. అయినా వారికి రుణాల మంజూరులో బ్యాంకర్లు ముందడుగు వేయడం లేదు. ప్రతి ఏడాదీ కౌలు రైతులకు రుణాల విషయంలో నిరాశే ఎదురవుతోంది. జిల్లాలో ఈ ఏడాది 16,250 మంది రైతులకు సీసీఆర్సీ(క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు)లు అందజేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిల్లో సర్వేనెంబర్ల ద్వారా 8326 మందికి, ఎల్పీఎం ద్వారా 4318 మందికి రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ 12644 మందికి కార్డులు పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏపీ పంటల సాగు హక్కు చట్టం-2019 సెక్షన్ 5(బి) ప్రకారం పంట రుణాలు పొందడం, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం పొందడానికి కౌలు కార్డులను వినియోగించుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయికి వచ్చేసరికి బ్యాంకుల నుంచి అనుకున్న స్థాయిలో రుణాలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈసారి రూ.140 కోట్ల రుణాలను అందించాలని జిల్లా అధికారులు నిర్దేశించారు. ఖరీఫ్ సీజన్ మొదలై రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ రూ.72 లక్షలే ఇచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏడాది కార్డులు పొందిన వారిలో 10 శాతం రైతులకు మాత్రమే రుణాలు మంజూరు చేసి బ్యాంకర్లు చేతులు దులుపుకుంటున్నారు.
- కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలంటే ఎటువంటి హామీ పత్రాలు ఉండవు. ప్రభుత్వం మంజూరు చేసిన సీసీఆర్సీ మాత్రమే ఉంటుంది. రైతుల మీద నమ్మకం తప్పా వేరే మార్గం లేదు. సాధారణ రైతు అయితే పట్టాదారుని పాస్ పుస్తకంతోపాటు డిజిటల్ సిగ్నేచర్ ఉన్న 1బి తీసుకుని తన ఆధీనంలో ఉంచుకుని బాంకులు రుణాలు అందజేస్తాయి. కౌలు రైతుల విషయంలో అటువంటి హామీ లేకపోవడంతో రుణాలు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సీసీఆర్సీ పొందిన రైతులందరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కౌలు రైతులు కోరుతున్నారు.