శాఖలవారీ ప్రోగ్రెస్ రిపోర్టులు ఏవీ?
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:22 AM
శాఖల వారీగా ప్రోగ్రస్ రిపోర్టులు ఏవీ అని ఎంపీడీవో సత్యంకు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రశ్నించారు.
పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ
సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై ఆగ్రహం
భామిని, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): శాఖల వారీగా ప్రోగ్రస్ రిపోర్టులు ఏవీ అని ఎంపీడీవో సత్యంకు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రశ్నించారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ తోట శాంతికుమారి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖల వారీగా ప్రోగ్రెస్ రిపోర్డులు ఏవీ అని ఎంపీడీవోను ప్రశ్నించారు. ఇక నుంచి సమావేశంలో వివరాలు లేకుంటే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగు శాఖపై ఏపీఎం ఎం.చక్రపాణి మాట్లాడుతూ నిరుద్యోగులకు రాయితీ రుణాలు ఇచ్చి, స్వయం ఉపాధి కల్పిస్తామని వివరించారు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమందికి అవగాహన కల్పించారని, ఎన్ని యూనిట్లు గుర్తించామని ప్రశ్నించారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ సభా ముఖంగా ప్రకటించారు. రెవెన్యూ శాఖపై చర్చించగా తహసీల్దార్ రాకపోవడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. రెవెన్యూ సదస్సుకు వచ్చిన దరఖాస్తులు ఎందుకు పరిష్కారం కాలేదని సర్వేయర్ రాజేష్, ఆర్ఐ మణి ప్రభకు ప్రశ్నించారు. రీ సర్వే భూములు జేసీ లాగిన్లో పరిష్కారం అవుతాయని, ఆర్ఐ బదులు చెప్పగా అర్జీదారుడు సమస్యలు మూడు వారాల్లో పరిష్కారం చేయకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మరికొన్ని సమస్యలపై చర్చించారు.