Share News

Dies Due to Fever జ్వరంతో గిరిజన బాలుడి మృతి

ABN , Publish Date - May 09 , 2025 | 11:31 PM

Tribal Boy Dies Due to Fever సీతంపేట మండలం పొల్ల పంచాయతీ పరిధి నాయకమ్మగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలుడు ఆరిక మోహిత్‌(7) జ్వరంతో బాధపడుతూ గురువారం మృతిచెందాడు. పెద్ద కొడుకు ఇలా ఆకస్మాత్తుగా మరణించండంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆడుతూ పాడుతూ ఉండే కుమారుడిని తల్చుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.

 Dies Due to Fever జ్వరంతో గిరిజన బాలుడి మృతి

సీతంపేట రూరల్‌, మే9(ఆంధ్రజ్యోతి): సీతంపేట మండలం పొల్ల పంచాయతీ పరిధి నాయకమ్మగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలుడు ఆరిక మోహిత్‌(7) జ్వరంతో బాధపడుతూ గురువారం మృతిచెందాడు. పెద్ద కొడుకు ఇలా ఆకస్మాత్తుగా మరణించండంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆడుతూ పాడుతూ ఉండే కుమారుడిని తల్చుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాయకమ్మగూడకు చెందిన ఆరిక సురేష్‌ ఫీడర్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. తనయుడు మోహిత్‌ను అదే గ్రామంలోని ఓ పాఠశాలలో చేర్పించాడు. ప్రస్తుతం ఆ గిరిజన విద్యార్థి రెండో తరగతి చదువుతున్నాడు. కాగా ఈ నెల నాలుగో తేదీన మోహిత్‌కు జ్వరం వచ్చింది. దీంతో సురేష్‌ తన కుమారుడిని దోనుబాయి పీహెచ్‌సీకి తీసుకువెళ్లాడు. వైద్యాధికారి భానుప్రతాప్‌ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అయితే గురువారం మధ్యాహ్నం మోహిత్‌ ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన దోనుబాయి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది సూచనల మేరకు బాలుడిని సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి చూడగా.. అప్పటికే మోహిత్‌ మృతి చెందాడని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. గుండెలవిసేలా భోరున విలపించారు.

Updated Date - May 09 , 2025 | 11:31 PM