68 కిలోమీటర్లు వాహనంలో పయనించి..
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:40 PM
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని గిరిశిఖర గ్రామాలైన డెన్స్రాయి, రేవడివలసలో గిరిజనులకు వైద్య సేవలందించడానికి తోణాం వైద్యసిబ్బంది పెద్ద సాహసం చేశారు.
వర్షంలో 3 కిలోమీటర్లు నడిచి
- గిరిశిఖర గ్రామాలకు వెళ్లి వైద్యసేవలు
-తోణాం వైద్యసిబ్బంది సాహసం
సాలూరు రూరల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని గిరిశిఖర గ్రామాలైన డెన్స్రాయి, రేవడివలసలో గిరిజనులకు వైద్య సేవలందించడానికి తోణాం వైద్యసిబ్బంది పెద్ద సాహసం చేశారు. చంద్రన్న సంచార వైద్య చికిత్సలో భాగంగా గురువారం తోణాం వైద్యాధికారి అక్యాన అజయ్ ఆధ్వర్యంలో వైద్య బృందం డెన్స్రాయి, రేవడివలస గ్రామాలకు బయలుదేరింది. ఈ గ్రామాలకు ఒడిశా మీదుగా వెళ్లాల్సి ఉంది. దీంతో ఈ బృందం ఒడిశా రాష్ట్రం సుంకి, రాళ్లగెడ్డ తదితర గ్రామాల మీదుగా వాహనంలో 68 కిలోమీటర్లు పయనించి ఏపీ బోర్డర్లోని గడివలసకు చేరుకుంది. అయితే, తుఫాన్ ప్రభావంతో అక్కడ ఒకపక్క జోరు వర్షం కురుస్తుండడం.. మరోపక్క రోడ్డు బాగులేకపోవడంతో వైద్య బృందం దాదాపు మూడు కిలోమీటర్లు వర్షంలో నడిచి డెన్స్రాయి, రేవడిలసకు చేరుకుని 45 మందికి వైద్యసేవలు అందించింది. 9 మంది గర్భిణులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యాధికారి అజయ్ వివరించారు. ఎనిమిదో నెల పూర్తికావస్తుండగానే సాలూరులో ఉన్న గర్భిణుల వసతిగృహంలో చేరాలని వారికి సూచించారు.

డెన్స్రాయిలో గిరిజనులకు వైద్యసేవలందిస్తున్న తోణాం వైద్యుడు అజయ్