నేడే ‘అన్నదాత సుఖీభవ’
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:30 AM
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది.
- రైతుల ఖాతాల్లోకి నిధులు
- రూ.7వేలు జమ చేయనున్న ప్రభుత్వం
- జిల్లాలో 2,19,503 మందికి లబ్ధి
- ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
విజయనగరం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అర్హులైన రైతన్నల ఖాతాల్లోకి శనివారం అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమచేయనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రూ.20 వేలు అందజేయనున్నారు. మొదటి విడతగా నేడు కేంద్రం తరపున రూ.2 వేలు, రాష్ట్ర సర్కారు నుంచి రూ.5 వేలు చొప్పున జమ చేయనున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గుర్తించిన 2,19,503 మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతగా రూ.152.45 కోట్లు జమకానుంది. మొత్తంగా మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ కింద రూ.6 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు జమ కానుంది.
మాట తప్పిన జగన్..
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ మాట తప్పారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి రైతుకూ సాగు ప్రోత్సాహం కింద రూ.15 వేలు అందిస్తానని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ, తీరా అధికారంలోకి వచ్చాక రూ.7,500 సాయానికే పరిమితం అయ్యారు. కేంద్రం అందించే రూ.6వేలతో కలుపుకొని రూ.13,500 అందించారు. అదంతా తామే ఇస్తున్నట్టు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. అప్పట్లో రైతుభరోసా పేరిట సాయం అందించిన జగన్.. అప్పటివరకూ రైతులకు అందిస్తూ వచ్చిన చాలా రకాల రాయితీలను నిలిపివేశారు. యంత్ర పరికరాల జాడలేదు. రాయితీపై అందించే ఎరువులను తగ్గించేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాయితీ పథకాలను పునరుద్ధరిస్తూనే.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం అమలుచేసి చంద్రబాబు రైతు పక్షపాతి అనిపించుకుంటున్నారు.
సచివాలయాల్లో జాబితా..
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో అన్నదాత సుఖీభవ పథకానికి సన్నాహాలు ప్రారంభించింది. సచివాలయాల వారీగా అర్హుల జాబితాను ప్రచురించింది. అదే సమయంలో ఈకేవైసీ చేయించుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది. ఆధార్ కార్డులు, వెబ్ల్యాండ్లో తప్పిదాలు సరిచేసేందుకు కూడా అవకాశం కల్పించింది. ప్రతి రైతుకూ సాగు ఆర్థిక సాయం అందించాలన్న ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. అందుకే శుక్రవారం సాయంత్రం వరకూ లోపాలు సవరించేందుకు ప్రయత్నాలు చేసింది. తహసీల్దార్ల లాగిన్లో రైతుల పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అలా తప్పిదాలు సరిచేసుకున్న వారందరికీ ఈరోజు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నాయి.
గజపతినగరంలో అత్యధికం..
జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2,19,503 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరికీ తొలి విడతగా రూ.7వేలు జమకానుంది. మొత్తం రూ.152.45 కోట్ల వరకూ జిల్లా రైతాంగానికి లబ్ధి చేకూరనుంది. జిల్లాలో అత్యధికంగా గజపతినగరం నియోజకవర్గంలో 43,644 మందికి లబ్ధికలగనుంది. రాజాం నియోజకవర్గంలో 38,691మందికి, బొబ్బిలి నియోజకవర్గంలో 34,744, చీపురుపల్లిలో 36,174, విజయనగరం 4,794, నెల్లిమర్లలో 27,654, ఎస్.కోటలో 41,211 మంది రైతులకు పథకం వర్తించనుంది.
ఏర్పాట్లు పూర్తయ్యాయి..
జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తారు. అటు తరువాత రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. కేంద్రం అందించే పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కలుపుకొని.. ప్రతి రైతు ఖాతాలో రూ.7 వేలు జమ అవుతుంది.
- వీటి రామారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, విజయనగరం
నేడు నిధులు జమ: కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్ ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని అర్హులైన రైతుల ఖాతాల్లో శనివారం అన్నదాత సుఖీభవ నిధులు జమవుతాయని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. విజయనగరం నియోజకవర్గంలోని చెల్లూరు, గజపతినగరంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్టు, బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయం వద్ద, చీపురుపల్లిలో డీకే పాలవలస, కొత్తవలస ఎంపీడీవో కార్యాలయం వద్ద, నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి డెంకాడ, రాజాంలో ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద అన్నదాత సుఖీభవ ప్రారంభత్సవ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.