Time for School బడికి వేళాయే..
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:41 AM
Time for School వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కూడా సిద్ధమయ్యారు. విద్యార్థులు ఇకపై సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మరోవైపు విద్యామిత్ర కిట్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.
ముగిసిన వేసవి సెలవులు
సాలూరు రూరల్/గరుగుబిల్లి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కూడా సిద్ధమయ్యారు. విద్యార్థులు ఇకపై సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మరోవైపు విద్యామిత్ర కిట్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1708 వరకూ ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో 90వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికి మధ్యాహ్నం భోజనం రుచికరంగా ఉండేందుకు మెనూలో పలు మార్పులు చేశారు. సన్నబియ్యంతో నేటి నుంచి రుచికరమైన భోజనమందించడానికి సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు జిల్లాలో పాఠశాలలకు 5,184 బస్తాల బియ్యాన్ని పంపిణీ చేశారు. 4,87,214 నోట్ పుస్తకాలు, 4,22,333 పాఠ్యపుస్తకాలు, 61,814 వర్క్బుక్లు, 89 వేల బ్యాగ్లు, 64 వేల బెల్ట్లు, బూట్లను మండలాలకు చేర్చారు. ఏకరూప దుస్తులు రావాల్సి ఉంది. వాటిని ఈ వారంలో పాఠశాలల్లో విద్యార్థులకందించనున్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల బ్యాగ్ బరువును తగ్గించింది. సూపర్ సిక్స్లో భాగమైన తల్లికి వందనం పథకం ఈ నెలలో అమలు చేయనున్నారు. పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఈ పథకంలో రూ. 15 వేలు అందించనున్నారు.