Ganesha’s Worship.. గణనాథుడి పూజకు వేళాయే..
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:34 PM
Time for Lord Ganesha’s Worship.. గణనాథుడి పూజకు వేళయ్యింది. నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. విద్యుత్ దీపాలతో అంతటా మండపాలు ముస్తాబయ్యాయి. బుధవారం వేడుకగా వినాయక చవితి పండుగను నిర్వహించేందుకు జిల్లావాసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం వరకూ జోరువాన కురవగా.. ఆ తర్వాత వాతవారణం మారింది. కాస్త తెరిపివ్వడంతో ప్రజలు బయటకు వచ్చి పూజా సామగ్రిని కొనుగోలు చేశారు. దీంతో జిల్లాలో మార్కెట్లన్నీ కళకళలాడాయి.
ముస్తాబైన మండపాలు
కిటకిటలాడిన మార్కెట్లు
మన్యంకు చవితి శోభ
పార్వతీపురం/పాలకొండ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): గణనాథుడి పూజకు వేళయ్యింది. నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. విద్యుత్ దీపాలతో అంతటా మండపాలు ముస్తాబయ్యాయి. బుధవారం వేడుకగా వినాయక చవితి పండుగను నిర్వహించేందుకు జిల్లావాసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం వరకూ జోరువాన కురవగా.. ఆ తర్వాత వాతవారణం మారింది. కాస్త తెరిపివ్వడంతో ప్రజలు బయటకు వచ్చి పూజా సామగ్రిని కొనుగోలు చేశారు. దీంతో జిల్లాలో మార్కెట్లన్నీ కళకళలాడాయి. ఇదే అదునుగా.. వ్యాపారులు పండ్లు, పూలు తదితర వాటిని అధిక ధరకు విక్రయించారు. ఇదిలా ఉండగా ముందస్తుగా ఆర్డర్లు ఇచ్చి వివిధ ఆకృతుల్లో తయారుచేయించుకున్న గణనాథుడి విగ్రహాలను ఉత్సవ కమిటీలు వాహనాల్లో మండపాలకు చేర్చాయి. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసేందుకు సన్నద్ధమయ్యాయి. మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కువ మంది అనుమతులు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1000 మండపాలు ఏర్పాటయ్యే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక మార్కెట్లో పలు ధరల్లో వినాయక విగ్రహాలు అందుబాటులో ఉండగా.. పలుచోట్ల స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి ప్రతిమలు పంపిణీ చేశాయి. మొత్తంగా జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాలతో పాటు 15 మండలాల్లో చవితి శోభ కనిపించింది. అంతటా సందడి వాతావరణం నెలకొంది.
అనుమతులు తీసుకోవాలి
వినాయక మండపాల నిర్వాహకులు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి తెలిపారు. మంగళవారం సబ్ కలెక్టరేట్లో ఏఎస్పీ అంకితా సురానతో కలిసి సమావేశం నిర్వహించారు. చవితి పండుగ నిర్వహణ, పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో చర్చించారు. రోడ్డుకు అడ్డంగా ఎవరూ మండపాలు ఏర్పాటు చేయరాదన్నారు. డీజే లను అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాలకు విద్యుత్ సరఫరా, నిమజ్జనం సమయంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈతరాని వాళ్లు, చిన్నపిల్లలు నీటిలోకి దిగకుండా చూడాలన్నారు.