Share News

returned to Totapalli తోటపల్లికి తిరిగొచ్చాయ్‌

ABN , Publish Date - May 26 , 2025 | 10:56 PM

They have returned to Totapalli గజరాజులు తోటపల్లికి తిరిగొచ్చాయి. కొద్ది రోజుల కిందట కొమరాడ వెళ్లిన అవి సోమవారం మండలానికి చేరుకున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న తోటపల్లి ప్రాంతంలో బీభత్సం సృష్టించాయి. సమీపంలోని మామిడి తోటను ధ్వంసం చేశాయి.

  returned to Totapalli తోటపల్లికి తిరిగొచ్చాయ్‌
తోటపల్లిలో సంచరిస్తున్న ఏనుగులు

  • మామిడి తోట ధ్వంసం

  • ప్రధాన రహదారిపై సంచారం

  • వాహనదారుల బెంబేలు

గరుగుబిల్లి, మే 26(ఆంధ్రజ్యోతి): గజరాజులు తోటపల్లికి తిరిగొచ్చాయి. కొద్ది రోజుల కిందట కొమరాడ వెళ్లిన అవి సోమవారం మండలానికి చేరుకున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న తోటపల్లి ప్రాంతంలో బీభత్సం సృష్టించాయి. సమీపంలోని మామిడి తోటను ధ్వంసం చేశాయి. రెండు, మూడు రోజుల్లో కోత కోసి పంటను విక్రయిద్దామనుకున్న సమయంలో ఏనుగులు ఇలా చేయడంతో రైతు తీవ్ర ఆవేదన చెందాడు. రూ. 50వేలు పైబడి నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. అధికారులు స్పందించి తనకు పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేశాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది, ట్రాకర్లు అప్రమత్తమై తోటపల్లి పంపు హౌస్‌ నుంచి నాగావళి నది మార్గం గుండా సుంకి వైపు ఏనుగులను తరలించారు. అయితే అవి పంట పొలాల్లో సంచరిస్తూ సుంకి ప్రధాన రహదారికి చేరుకున్నాయి. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులుదీరాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుటాహుటిన అటవీ శాఖ సిబ్బంది చేరుకుని ఏనుగుల గుంపును సమీప పొలాల్లోకి తరలించడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత యథావిధిగా రాకపోకలు సాగించారు.

తాలాడలో

భామిని, మే 26 (ఆంధ్రజ్యోతి): భామిని మండలంలో ఉన్న ఏనుగులు సైతం స్థానికులను బెంబేలెత్తించాయి. సోమవారం అవి తాలాడ ప్రాంతానికి చేరుకోవడంతో గ్రామస్థులు హడలెత్తిపోయారు. వారం రోజులుగా ఆవిలమ్మ తోటల్లో తిష్ఠవేసిన గజరాజులు ఆదివారం రాత్రి గ్రామ సమీపంలో అమ్మవారి గుడి ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడున్న మొక్కజొన్న, మామిడి, జీడి పంటలను నాశనం చేశాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఫారెస్ట్‌ అధికారులు ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Updated Date - May 26 , 2025 | 10:56 PM