మహనీయుడు జ్యోతిబా పూలే
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:08 AM
నవ సమాజ స్థాపనకు బాటలు వేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొనియాడారు.

- కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): నవ సమాజ స్థాపనకు బాటలు వేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొనియాడారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జ్యోతిబా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్ సమీపంలోని పూలే, సావిత్రబాయి విగ్రహాలకు పూలమాలలు వేసి కలెక్టర్, అధికారులు నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన జయంతి సభలో ఆయన మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ కంటే ముందే నవ సమాజ సాధనకు పూలే పునాది వేశారని అన్నారు. ఆయన ఆలోచనలు, కృషి ఫలాలను నేటితరం అందుకుంటుందన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ విశ్వకర్మ యోజనను అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ.. మహిళల హక్కులు, వారి విద్య కోసం పూలే విశేష కృషి చేశారని కొనియాడారు. అనంతరం 400 మందికి బీసీ రుణాలు, ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి, డీఆర్వో శ్రీనివాస మూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారి జ్యోతిశ్రీ, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు, బీసీ సంఘ నాయకులు ముద్దాడ మధు, వై.శంకరరావు, గొలగాని రమేష్, కిల్లంపల్లి ఆచారి తదితరులు ఉన్నారు. జిల్లా బిసి సంక్షేమాధికారి జ్యోతిశ్రీ, బిసి కార్పోరేషన్ ఈడి పెంటోజీరావు ఉన్నారు.