అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:05 AM
జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్ - అక్షర ఆంధ్ర’ లక్ష్యమని వయోజన విద్యా అధికారి టంకాల వైకుంఠరావు అన్నారు.
- వయోజన విద్యా అధికారి వైకుంఠరావు
బెలగాం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్ - అక్షర ఆంధ్ర’ లక్ష్యమని వయోజన విద్యా అధికారి టంకాల వైకుంఠరావు అన్నారు. వయోజనులకు చదవడం, రాయడం, చిన్నచిన్న లెక్కలు చేయగలిగేలా నేర్పించడంపై వివిధ శాఖల అధికారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2,01,058 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు సచివాలయ సిబ్బంది సర్వే ద్వారా తెలిసిందన్నారు. 2029 నాటికి వారిని ‘ఉల్లాస్ - అక్షర ఆంధ్ర’ కార్యక్రమం ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. డీఆర్డీఏ, మెప్మా, డ్వామా శాఖల ద్వారా వలంటీర్ టీచర్లను గుర్తించి 1:10 చొప్పున నిరక్షరాస్యులను మ్యాపింగ్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సుధారాణి, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ తదితర అధికారులు పాల్గొన్నారు.