The glory of the Uyyala Kambala festival వైభవం.. ఉయ్యాల కంబాల ఉత్సవం
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:13 AM
The glory of the Uyyala Kambala festival పైడిమాంబ సిరిమానోత్సవంలో చివరి ఘట్టమైన ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవం పురస్కరించుకుని నగరంలోని పైడిమాంబ చదురుగుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైభవం.. ఉయ్యాల కంబాల ఉత్సవం
నేడు చండీహోమం..
ముగియనున్న పైడిమాంబ భక్తుల దీక్షాధారణ
విజయనగరం రూరల్/ కల్చరల్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమానోత్సవంలో చివరి ఘట్టమైన ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవం పురస్కరించుకుని నగరంలోని పైడిమాంబ చదురుగుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పువ్వులతో అలంకరించారు. పిండివంటలతో కూడిన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం 4.45 గంటలకు సుప్రభాత సేవ అనంతరం భక్తులకు పైడిమాంబ దర్శనాన్ని కల్పించారు. ఉదయం 6 గంటల నుంచి మఽఽధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తులు అధిక సంఖ్యలో పైడిమాంబను దర్శించుకున్నారు, తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి వీలుకాని భక్తులంతా ఉయ్యాల కంబాల సందర్భంగా దర్శించుకునేందుకు రావడంతో చదురుగుడి, వనంగుడి భక్తులతో కోలాహలంగా కన్పించాయి. ఉయ్యాల కంబాల రోజు కూడా నేలవేషాలు, పులివేషాలు సందడి చేశాయి. రాత్రి 7.30 గంటలకు ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు చదురుగుడి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉయ్యాలలో పైడిమాంబ ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అఽధిక సంఖ్యలో తరలివచ్చారు. దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష పర్యవేక్షణలో ఆలయ అఽధికారులు ఉత్సవ ఏర్పాట్లు చేశారు.