The aim is to protect visitors సందర్శకుల రక్షణే లక్ష్యం
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:58 PM
The aim is to protect visitors తాటిపూడి పర్యాటక ప్రాంతానికి వచ్చే సందర్శకుల రక్షణ కోసం రిజర్వాయర్ వద్ద పోలీసు అవుట్ పోస్టు ఏర్పాటు చేశామని ఎస్పీ వకుల్జిందల్ తెలిపారు. మంగళవారం తాటిపూడి వద్ద ప్రారంభ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు.
సందర్శకుల రక్షణే లక్ష్యం
ఎస్పీ వకుల్జిందాల్
తాటిపూడి వద్ద పోలీస్ అవుట్ పోస్టు ప్రారంభం
గంట్యాడ, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : తాటిపూడి పర్యాటక ప్రాంతానికి వచ్చే సందర్శకుల రక్షణ కోసం రిజర్వాయర్ వద్ద పోలీసు అవుట్ పోస్టు ఏర్పాటు చేశామని ఎస్పీ వకుల్జిందల్ తెలిపారు. మంగళవారం తాటిపూడి వద్ద ప్రారంభ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాటిపూడి రిజర్వాయర్లో బోటు షికారు ఉండడం వల్ల ఇక్కడికి సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని, వారి భద్రత కోసం చర్యలు తీసుకున్నామన్నారు. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నియంత్రించేందుకు కూడా పోలీస్ అవుట్ పోస్టు దోహదపడుతుందన్నారు. పోలీసు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని, అలాగే ఇక్కడికి వచ్చే సందర్శకులు బోటు షికారు చేసే సమయంలో నిబంధనలు పాటించాలని సూచించారు లైఫ్ జాకెట్లు వినియోగించాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకంగా దృష్టిపెట్టామని, వాటిని తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే సైబర్ మోసాలు, మహిళల భద్రత, రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళ భద్రత కోసం జిల్లాలో ఐదు శక్తి టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలేజీల్లో యాంటీర్యాంగింగ్పై అవగాహన కల్పించనున్నామన్నారు.
అనంతరం తాటిపూడి రిజర్వాయర్ను పరిశీలించారు. బోటులో ప్రయాణం చేసి రిజర్వాయర్ ఆవల ఉన్న ఎకోటూరిజం కాటేజీలను పరిశీలించారు. ఆయన వెంట ఏఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ సాయికృష్ణ తదితరులు ఉన్నారు.