ఆ చోరీ.. అంతర్రాష్ట్ర దొంగల పనే
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:20 AM
మంగళపాలెంలో గత 28న రాత్రి జరిగిన భారీ చోరీ అంతర్రాష్ట్ర దొంగల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.
కొత్తవలస, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): మంగళపాలెంలో గత 28న రాత్రి జరిగిన భారీ చోరీ అంతర్రాష్ట్ర దొంగల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఈ చోరీలో 90 తులాల బంగారంతో పాటు రూ.5 లక్షల నగదు చోరీకి గురైనట్టు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీశ్బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాధితుడు ఫిర్యాదులో తెలిపిన దానికి మించి సొత్తు అధికంగా అపహరణకు గురికావడంతో విశాఖ రేంజ్ డీఐజీ, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ రంగంలోకి దిగారు. వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ముందుగా స్థానికులు, ట్రస్టులో పనిచేస్తున్న కొందరిని పోలీసులు విచారించినప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో అంతర్రాష్ట్ర ముఠాలు చేసిన పనేనని నిర్థారణకు వచ్చారు. ఈ తరహా నేరాలకు పాల్పడిన దొంగల ముఠాలకు సంబంధించి వివరాలను సేకరించి నేరస్థలంలో తీసిన వేలిముద్రలతో సరిపోలుస్తున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలను వివిధ రాష్ట్రాలకు పంపించారు. ప్రధానంగా దొంగతనం జరగడానికి ముందు ఈ ప్రాంతంలో జరిగిన ఫోన్ కాల్స్పై పోలీసులు దృష్టి పెట్టారు. అంతకు ముందు రోజు ఆప్రాంతంలో జరిగిన ఫోన్ కాల్స్కు సంబంధించి డేటాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఒక పక్క వివిధ రాష్ట్రాలకు పోలీసుల బృందాలను పంపించినప్పటికీ కొంతమంది కదలికపై పోలీసులు నిఘా పెట్టారు. రెండు, మూడు రోజుల్లో నేరస్తులను పట్టుకోగలనమనే ధీమా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.