వసతి గృహాలపై నిఘా
ABN , Publish Date - May 08 , 2025 | 11:42 PM
గిరిజన వసతి గృహాలపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు. అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
-విద్యార్థుల భద్రతకు పెద్దపీట
- మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
గుమ్మలక్ష్మీపురం, మే 8 (ఆంధ్రజ్యోతి): గిరిజన వసతి గృహాలపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు. అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రత కోసం వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతుంది. జిల్లాలో 65 వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో 25 వేల మందికి పైగా గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 74 వసతి గృహాలు ఉండగా, ఇక్కడ 15 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని గురుకుల పాఠశాలలు, కళాశాలలు, మినీ గురుకులాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ కెమెరాల నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో చాలా వరకు మూలకు చేరాయి. ప్రహరీలు కూడా లేకపోవడంతో తరచూ విద్యార్థులు బయటకు వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. హాస్టళ్లలోకి ఎవరు వస్తున్నారో, వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వీటిని దృష్టిలో ఉంచుకొని గిరిజన విద్యార్థుల భద్రతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వసతి గృహాలపై నిఘా పెట్టేందుకు వీలుంటుంది. విద్యార్థుల భద్రత మరింత సులభతరం అవుతుంది. జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలను అమర్చాలని ఇప్పటికే గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు.
మౌలిక సదుపాయాలపై దృష్టి
గిరిజన పాఠశాలలు, వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో సెక్యూరిటీ గార్డులను నియమించింది. అలాగే, ఉపాధి హామీ పథకం కింద ప్రహరీల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే చాలా పాఠశాలల్లో రక్షణ గోడల నిర్మాణం పూర్తయింది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గిరిజన విద్యార్థులను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాస్మెటిక్స్ను జీసీసీ ద్వారా అదనంగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంది. మెనూ చార్జీలు కూడా పెంచింది. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ.1400, ఆపై తరగతుల చదువుతున్న వారికి రూ.1600 చొప్పున మెనూ చార్జీల కింద ప్రభుత్వం చెల్లించనుంది. నోట్పుస్తకాలు, స్టీల్ ప్లేట్లను సరఫరా చేయనుంది. విద్యార్థులకు ప్రతి నెలా క్షవరం చార్జీల కింద రూ.50 చెల్లించనుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ.. త్వరలో జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.