Share News

vetanadarulu వేతనదారులకు అండగా..

ABN , Publish Date - May 09 , 2025 | 11:34 PM

Support for vetanadarulu ఉపాధి కూలీలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం బీమా పథకాలను అందబాటులోకి తెచ్చింది. వాటిద్వారా వేతనదారులకు భరోసా కల్పించనుంది. పనుల ప్రదేశంలో ప్రమాదాల బారిన పడినా.. మరణించినా.. వైకల్యం పొందినా బాధిత కుటుంబ సభ్యులకు బీమా మొత్తం చెల్లించి ఆదుకోనుంది.

  vetanadarulu వేతనదారులకు అండగా..
ఉపాధి హామీ పనులు చేపడుతున్న వేతనదారులు

జాబ్‌కార్డుదారులందరూ అర్హులే..

పీఎం సురక్ష, జీవన జ్యోతి యోజనలతో భరోసా

పార్వతీపురం, మే9(ఆంధ్రజ్యోతి): ఉపాధి కూలీలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం బీమా పథకాలను అందబాటులోకి తెచ్చింది. వాటిద్వారా వేతనదారులకు భరోసా కల్పించనుంది. పనుల ప్రదేశంలో ప్రమాదాల బారిన పడినా.. మరణించినా.. వైకల్యం పొందినా బాధిత కుటుంబ సభ్యులకు బీమా మొత్తం చెల్లించి ఆదుకోనుంది. ఉపాధి పనులకు వెళ్లిన వారు ఏదైనా కారణంతో మృతి చెందితే ఇప్పటివరకు రూ.50 వేలు మాత్రమే అందిస్తున్నారు. ఇకపై రూ. రెండు లక్షల వరకు అందించనున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధి కూలీలకు బీమా సౌకర్యం కల్పించే చర్యలను అధికారులు వేగవంతం చేశారు.

బీమా అమలు ఇలా..

- ఉపాధి వేతనదారులు పనులు చేపట్టే సమయంలో మృతి చెందినా లేదా ఏదైనా ప్రమాదంలో వైకల్యం పొందినా బీమా కింద కొంత మొత్తం చెల్లిస్తారు. పీఎం సురక్ష యోజన , జీవనజ్యోతి యోజన బీమా పథకాల ద్వారా వేతనదారుల కుటుంబాలకు భరోసా కల్పిస్తారు. జిల్లాలో 1.94 లక్షల మేర జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 1.90 లక్షల కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తంగా 1.33 లక్షల మంది వేతనదారులు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వారందరికీ బీమా పథకాలు వర్తింపజేయనున్నారు.

- సురక్ష యోజన కింద 18 నుంచి 70 సంవత్సరాలు వయసు కలిగిన వేతనదారులు ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లించాలి. జాబ్‌కార్డులో నమోదైన వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో నమోదైన వేతనదారులు మృతి చెందినా లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినా రూ. రెండు లక్షలు చెల్లిస్తారు. పాక్షిక వైకల్యం పొందిన వారికి రూ.లక్ష బీమా కింద అందుతుంది.

- జీవన జ్యోతి యోజన కింద 50 సంవత్సరాల లోపు వేతనదారులు బీమా పొందొచ్చు. ఇందుకోసం వేతనదారుడు ఏడాదికి రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. జాబ్‌కార్డు పేరు ఉన్న వారికే ఇది వర్తిస్తుంది. సహజ మరణమైనా, పాక్షిక వైకల్యమైనా, ప్రమాదవశాత్తూ మరణించినా బాఽధిత కుటుంబానికి రూ.రెండు లక్షలు అందిస్తారు. కూలీల బ్యాంకు ఖాతాల నుంచి ఏటా ప్రీమియం మొత్తం వసూలు చేస్తారు. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉపాధి కూలీలందరికీ బీమా పథకాలు వర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కష్టకాలంలో వేతనదారుల కుటుంబాలకు అవి ఎంతగానో దోహడపడతాయి.’ అని డ్వామా పీడీ రామచంద్రరావు తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 11:34 PM