Studies Under the Tree చెట్టు కిందే చదువులు
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:21 PM
Studies Under the Tree పనసభద్ర పంచాయతీ పరిధి చెలకమెండగి గ్రామంలోని మండల ప్రాఽథమిక పాఠశాలకు పక్కా భవనం లేదు. దీంతో ఇక్కడున్న 30 మంది విద్యార్థులు చెట్టు కిందే చదువులు కొనసాగించాల్సి వస్తోంది.
గిరిజన విద్యార్థులకు తప్పని అవస్థలు
మక్కువ రూరల్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పనసభద్ర పంచాయతీ పరిధి చెలకమెండగి గ్రామంలోని మండల ప్రాఽథమిక పాఠశాలకు పక్కా భవనం లేదు. దీంతో ఇక్కడున్న 30 మంది విద్యార్థులు చెట్టు కిందే చదువులు కొనసాగించాల్సి వస్తోంది. వాస్తవంగా దుగ్గేరు గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉన్న చెలకమెండగిలో పాఠశాల భవన నిర్మాణానికి 2014-2019లో నిధులు మంజూరయ్యాయి. అయితే పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కి మళ్లాయి. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ పాఠశాల నిర్మాణంపై దృష్టి సారించలేదు. దీంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రస్తుతం ఆరుబయటే వారికి తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షం కురిస్తే .. ఇక ఆ రోజు పాఠశాలకు సెలవే. తమ గ్రామంలో బడికి పక్కాభవనం నిర్మించాలని ఆ గ్రామస్థులు అనేకసార్లు పార్వతీ పురం ఐటీడీఏ అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. దీనిపై మక్కువ ఎంఈవో శ్యామ్సుందరరావును వివరణ కోరగా.. నిధులు మంజూరైతే చెలకమెండంగిలో పాఠశాల భవన నిర్మాణం చేపడతామని తెలిపారు.