మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:16 AM
మాదకద్రవ్యాలు, మత్తు పదార్దాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు.
నెల్లిమర్ల, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలు, మత్తు పదార్దాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నెల్లిమర్లలో గురువారం జరిగిన పోలీసుల అభ్యుదయ ర్యాలీకి బంగార్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఊపి అభ్యుదయ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని అన్నారు. ఈ తరహా సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు, 1972 టోల్ఫ్రీ నెంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల, విద్యార్థుల పేర్లు గోప్యంగా ఉంచుతారని బంగార్రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ రామకృష్ణ, టీడీపీ నాయకులు సువ్వాడ రవిశేఖర్, మండల కమిటీ అధ్యక్షుడు కడగల ఆనంద్కుమార్, జిల్లా కార్యదర్శి లెంక అప్పలనాయుడు, జనసేన పార్టీ నాయకులు కరుమజ్జి గోవిందరావు, అంబల్ల అప్పల నాయుడు, ఎంఎం.నాయుడు, మిమ్స్ వైద్య కళాశాల ఏవో గణేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే.రేఖ తదితరులు పాల్గొన్నారు. నిమ్స్ వైద్య విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ అందరినీ ఆకట్టుకుంది.