Sanitation Drive 16 నుంచి ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:59 PM
Special Sanitation Drive from 16th జిల్లాలో ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు
పార్వతీపురం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ పక్షోత్సవాల సందర్భంగా ప్రతి గ్రామంలో పారిశుధ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపర్చాలి. గ్రామాల్లోని మురుగునీటి కాలువల్లో పూడికలను తీయించి.. బ్లీచింగ్ జల్లాలి. చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలించాలి. గ్రామస్థులకు సురక్షిత నీటిని అందించాలి. రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించాలి. జిల్లాలో మలేరియా కేసులు నమోదు కాకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలి. ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. యాంటీలార్వా ఆపరేషన్ తప్పనిసరిగా చేపట్టాలి.’ అని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు తప్పనిసరిగా తమ ప్రాంతంలోని పీహెచ్సీలను సందర్శించాలి. ఈ సమావేశంలో డీపీవో టి.కొండలరావు, డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.