Share News

పీజీఆర్‌ఎస్‌ వినతులపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:33 PM

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌ వినతులపై ప్రత్యేక దృష్టి
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల కార్యాలయాలకు జిల్లా నుంచి అందిన దరఖాస్తులపై కలెక్టర్‌ తన కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. మొత్తం 10 వినతులను ఈ పరిశీలించారు. ఫిర్యాదుదారులను తమ చాంబర్‌కు పిలిపించి... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వద్దనున్న సంబంధిత పత్రాలను పరిశీలించారు. ఆ ఫిర్యాదులకు సంబంధించి రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌ మురళి, డ్వామా పీడీ శారదాదేవి, డీసీవో రమేష్‌, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీఆఽశయ్య, ఆర్‌డీవో కీర్తి తదితరులు పాల్గొన్నారు.

32 బాలల సంరక్షణ కేంద్రాలకు ప్రతిపాదనలు

జిల్లాలో 32 బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 5, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 27 ఏర్పాటు చేసుకొనేందుకు ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయి. జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ -2015 ప్రకారం వీటిని ఏర్పాటు చేసేందుకు డీపీవో కన్వీనర్‌గా ఉన్న ఇన్‌స్పెక్షన్‌ కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులను కలెక్టర్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీ మంగళవారం పరిశీలించింది. నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయో? లేదో అక్కడక్కడా తనిఖీ చేసి, నివేదిక ఇవ్వాలని..ఆ తరువాతే ఆమోదిస్తామని కలెక్టర్‌ సృష్టం చేశారు. ఈ సమావేశంలో బాలల సంరక్షణ కమిటీ జిల్లా చైర్మన్‌ గోటేటి హిమబిందు, ఏఎస్పీ సౌమ్యలత, ఐసీడీఎస్‌ పీడీ రుక్సానా బేగం, డీసీపీయూ లక్ష్మి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:33 PM