Work Like This? ఇలా అయితే.. పనిచేసేదెలా?
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:28 PM
So, How Do We Work Like This? జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలందించే సిబ్బంది, వైద్యాధికారుల పరిస్థితి దయనీయంగా మారింది. నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో పనిచేస్తున్న వారు స్పెషల్ అలవెన్స్, పదోన్నతలకు నోచుకోవడం లేదు. వారి సేవలకు సరైన గుర్తింపు కూడా లభించడం లేదు.
స్పెషల్ అలవెన్స్, పదోన్నతలకు దూరం
ప్రోత్సాహకాలకూ నోచని వైనం
బదిలీల కోసం తీవ్ర ప్రయత్నం
మరికొందరు రాజీనామా చేసి వెళ్లేందుకు సన్నద్ధం
గిరిజనుల వైద్య సేవలపై ప్రభావం
పార్వతీపురం, జూన్25(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలందించే సిబ్బంది, వైద్యాధికారుల పరిస్థితి దయనీయంగా మారింది. నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో పనిచేస్తున్న వారు స్పెషల్ అలవెన్స్, పదోన్నతలకు నోచుకోవడం లేదు. వారి సేవలకు సరైన గుర్తింపు కూడా లభించడం లేదు. గిరిజన ప్రాంతాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు కూడా అందడం లేదు. దీంతో చాలామంది ‘మన్యం’ నుంచి బదిలీలపై , మరికొందరు రాజీనామాలు చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలు ఉన్నాయి. వాటి పరిధిలోని గిరిజన ప్రాం తాల్లో ఎంతోమంది వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ఐటీడీఏల పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్రాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు ఏజెన్సీ అలవెన్స్ ఇస్తున్నారు. అయితే ఏజెన్సీలో నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న పీహెచ్సీలో పనిచేస్తున్న వైద్యులకు మాత్రం అలవెన్స్ ఇవ్వడం లేదు. వైద్య, పారామెడికల్ సిబ్బందికి కూడా అలవెన్స్కు నోచుకోవడం లేదు. అక్కడే కొన్నేళ్లుగా పనిచేస్తున్న పీహెచ్సీ వైద్యాధికారులకు కూడా పదోన్నతులు కల్పించడం లేదు. సెకండరీ హెల్త్ వైద్యాధికారులు రెండు నుంచి మూడేళ్ల సర్వీస్లోనే డిప్యూటీ సివిల్ సర్జన్లుగా పదోన్నతులు పొందుతున్నారు. అయితే ఐటీడీఏల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఏజెన్సీలో పనిచేస్తున్న చాలా మంది వైద్యులు పదోన్నతులు రాక సర్వీసును ముగించుకోవాల్సి వస్తోంది.
- గిరిజన ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు పీజీ ఇన్ సర్వీస్ కోటా గతంలో కంటే తగ్గించారు. రానున్న రోజుల్లో ఈ కోటాను పూర్తిగా ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే జరిగితే యువ వైద్యులు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఈ క్రమంలో గిరిజనులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలందడం ప్రశ్నార్థకమవుతుందని చెప్పొచ్చు.
- ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ వైద్యులు నోషనల్ ఇంక్రిమెంట్లు కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు పీజీ కోటా తగ్గించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
- ఈ సమస్యలను పరిష్కరించి భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల్లో వైద్యులు పనిచేసే విధంగా ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు.
సేవలను గుర్తించాలి..
గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలందించే మమ్మల్ని గుర్తించి సమస్యలను పరిష్కరించాలి. యువ వైద్యులు ఇక్కడ పనిచేసేలా ప్రోత్సాహకాలు అందించాలి. ఏజెన్సీలో పనిచేసే వైద్యులకు సకాలంలో పదోన్నతులు కల్పించి.. అలవెన్స్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- రఘు కుమార్, వినోద్, జిల్లా వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు