Registrations! రిజిస్ట్రేషన్లకు ‘స్లాట్!’
ABN , Publish Date - May 04 , 2025 | 11:28 PM
Slot System for Registrations! రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్లాట్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీని ద్వారా క్రయ, విక్రయదారులు గతంలో మాదిరిగా గంటల తరబడి వేచి ఉండనక్కరలేదు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల మధ్య తమకు వీలున్న సమయంలో స్లాట్ బుక్ చేసుకొని ఆ సమయానికి రావొచ్చు.
ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు
క్రయ విక్రయదారుల సమయం ఆదా
సాలూరు రూరల్, మే 4(ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్లాట్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీని ద్వారా క్రయ, విక్రయదారులు గతంలో మాదిరిగా గంటల తరబడి వేచి ఉండనక్కరలేదు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల మధ్య తమకు వీలున్న సమయంలో స్లాట్ బుక్ చేసుకొని ఆ సమయానికి రావొచ్చు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్లో లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా స్లాట్ను బుకింగ్ చేసుకోవచ్చు. పది నిమిషాలకు ఒక స్లాట్ చొప్పున గంటకు ఆరు స్లాట్లను కేటాయించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ కార్యాలయాల్లో ఈ విధానంలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే స్లాట్ విధానం తొలి దశలో ఉండడంతో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటిని తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి..
స్లాట్ రిజిస్ట్రేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఇప్పటివరకు 1550 రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాలూరులో 457 , పార్వతీపురంలో 471, పాలకొండలో 476, కురుపాంలో 146 రిజిస్ట్రేషన్లు జరిగాయి. జిల్లాలో సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ కార్యాలయాల్లో గత ఆర్థిక సంవత్సరం (2024-2025)లో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. రూ.78.33 కోట్ల లక్ష్యానికి గాను కేవలం రూ. 39.78 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రస్తుతం రియట్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడంతో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 61 కోట్లు లక్ష్యంగా నిర్ణయించారు.
సాంకేతిక ఇబ్బందులు
ప్రస్తుతం 2.0 వెర్షన్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే సర్వర్లో సమస్యల వల్ల ఈ వెర్షన్లో రిజిస్ట్రేషన్లు జాప్యమవుతున్నాయి. కాగా దీని అప్డేట్ వెర్షన్కు అధికారులు కృషి చేస్తున్నారు. స్లాట్ విధానంలో రోజుకు 38 వరకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశముంది. వాటి సంఖ్య పెంచేందుకు సాంకేతిక మార్పులు తేవాల్సి ఉంది. స్లాట్ సంఖ్యను పెంచాల్సి ఉందని ప్రజలు, క్రయ, విక్రయదారులు అభిప్రాయపడుతున్నారు. బుక్ చేసిన స్లాట్ సమయానికి ఏ ఒక్కరు రాలేక పోయినా మళ్లీ రీ షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం మళ్లీ రూ.200 చలానా చెల్లించాలి. అంతేగాక మరుసటి రోజు రావాల్సి ఉంది. కొద్దిపాటి జాప్యమైనా స్లాట్ను మళ్లీ అనుమతించేలా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్లాట్ విధానంలో అవగాహన కోసం సేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
లక్ష్యసాధనకు కృషి
ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయ లక్ష్యసాధనకు కృషి చేస్తాం. ఈ మేరకు జిల్లాలో నాలుగు కార్యాలయాల అధికారులకు తగు సూచనలు జారీ చేశాం. స్లాట్ విధానంలో సాంకేతిక ఇబ్బం దులను తొలగించి.. రిజిస్ట్రేషన్లు జాప్యం జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
- వీవీ నాగరాజు, జిల్లా రిజిస్ట్రార్ (ఎఫ్ఏసీ), పార్వతీపురం మన్యం