శ్రావణ శోభ
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:40 PM
మార్కెట్కు శ్రావణ శోభ సంతరించుకుంది.
- కిటకిటలాడిన మార్కెట్లు
- నేడు వరలక్ష్మీ వ్రతం
- పూలు, పండ్ల ధరలకు రెక్కలు
పాలకొండ/మక్కువ/వీరఘట్టం(పాలకొండ),సాలూరురూరల్/బెలగాం/ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): మార్కెట్కు శ్రావణ శోభ సంతరించుకుంది. శుక్రవారం నిర్వహించే వరలక్ష్మీ వ్రతం కోసం అవసరమైన పూజా సామగ్రి, దుస్తులు, పూలు, పండ్లు, బంగారం కాసు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో పాలకొండ, పార్వతీపురం, సాలూరు, వీరఘట్టం, మక్కువ, కురుపాం తదితర మండలాల్లోని ప్రధాన మార్కెట్లు రద్దీగా మారాయి. పూజా సామగ్రి, పండ్లు, పూలు ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. డజను చామంతి పూలు రూ.50, డజను గులాబీలు రూ.50, ఐదు బంతి పూలు రూ.30కి వ్యాపారులు విక్రయించారు. ఇక పండ్ల విషయానికి వస్తే యాపిల్, దానిమ్మ కిలో రూ.300, జామి, ద్రాక్ష కిలో రూ.200 దాటి విక్రయించారు. డజను అరటిపండ్లు సైజును బట్టి రూ.80 నుంచి రూ.150 వరకు అమ్మకాలు చేశారు. ప్రధానంగా లక్ష్మీదేవి ప్రతిమ గల కాసులను మహిళలు కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా గురువారం కోట్లాది రూపాయల వ్యాపారం జరిగినట్లు తెలిసింది.