Sun మండుతున్న ఎండలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 10:51 PM
Scorching Sun జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఠారెత్తిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది.

రానున్న రెండురోజులూ వడగాడ్పులు
పార్వతీపురం/సాలూరు రూరల్/గుమ్మలక్ష్మీపురం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఠారెత్తిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. సాలూరులో 41.4, బలిజిపేటలో 41.3, పాచిపెంటలో 41, భామిని, గరుగుబిల్లిల్లో 40.4, పాల కొండలో 40.9, మక్కువలో 40.7, గుమ్మలక్ష్మీపురంలో 39.2, జియ్యమ్మవలసలో 39.8, కొమరాడలో 38.7, కురుపాంలో 40.1, పార్వతీపురంలో 39.9, సీతంపేటలో 40.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. జియ్యమ్మవలస, పార్వతీపురం మండలాల్లో వడగాల్పులు వీచాయి. సోమ, మంగళ వారాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముంది. దాదాపు అన్ని మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణల సంస్థ ప్రకటించింది. ఎండ తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్లు వదిలి బయటకు రాలేకపోతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళల్లో జిల్లాలో ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏదేమైనా ఎండ వేడి ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితేమిటోనని జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు.