Parvathipuram పార్వతీ‘పురం’లో మారిన సీన్
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:39 PM
Scene Changed in Parvathipuram పార్వతీపురం మునిసిపాలిటీ తాత్కాలిక చైర్పర్సన్గా 23వ వార్డుకు చెందిన మంత్రి ఉమామహేశ్వరిని ఎన్నుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో రూ.80 లక్షల విలువైన రోడ్లు, కాలువల పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మంగళవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
నాటకీయ పరిణామాల మధ్య ఎన్నిక
బెలగాం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మునిసిపాలిటీ తాత్కాలిక చైర్పర్సన్గా 23వ వార్డుకు చెందిన మంత్రి ఉమామహేశ్వరిని ఎన్నుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో రూ.80 లక్షల విలువైన రోడ్లు, కాలువల పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మంగళవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రజలకు తాగునీరు అందించడంలో విఫలమయ్యారని అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఇదే సమయంలో అధికారులు సైతం తనను లెక్క చేయడం లేదని, కూటమికి అనుకూలంగా నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి వాకౌట్ చేశారు. అయితే ఆమె ఇలా సమావేశం మధ్యలో వెళ్లిపోవడం నాలుగోసారి. దీనివల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని కౌన్సిలర్లు, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర భావించారు. ఈ మేరకు 1965 మునిసిపల్ చట్టం ప్రకారం మెజార్టీ కౌన్సిలర్ల ఆమోదంతో తాత్కాలిక చైర్పర్సన్గా మంత్రి ఉమామహేశ్వరిని ఎన్నుకున్నట్టు కమిషనర్ డి.శ్రీనివాసరాజు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఆధ్వర్యంలో సమావేశం కొనసాగించారు.