Allegations! అదే తీరు.. అనేక ఆరోపణలు!
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:42 PM
Same Approach… Multiple Allegations! గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ శ్రీనివాస్ తన చాంబర్లో ఓ కాంట్రాక్టరు నుంచి భారీగా లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఏకలవ్య పాఠశాల భవనాల బిల్లుల మంజూరుకు రూ.5కోట్లు డిమాండ్ చేసి.. చివరకు ఆఫీసులోనే రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కాగా జిల్లాలో ఆయన పనిచేసిన కాలంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎంతోమంది బాధితులు కూడా ఉన్నారు.
గతంలో మన్యంలో విధుల నిర్వహణ
పలు కేసుల నమోదు
తాజాగా ఏసీబీకి చిక్కడంతో వెలుగులోకి నాటి సంగతులు
పార్వతీపురం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ శ్రీనివాస్ తన చాంబర్లో ఓ కాంట్రాక్టరు నుంచి భారీగా లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఏకలవ్య పాఠశాల భవనాల బిల్లుల మంజూరుకు రూ.5కోట్లు డిమాండ్ చేసి.. చివరకు ఆఫీసులోనే రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కాగా జిల్లాలో ఆయన పనిచేసిన కాలంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎంతోమంది బాధితులు కూడా ఉన్నారు. 1994లో పార్వతీపురం ఐటీడీఏలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా శ్రీనివాస్ పనిచేశారు. అప్పట్లో ఈఏఎస్ గ్రాంట్ కింద రూ.ఐదు లక్షల అంచనాతో మావుడి నుంచి నంద వరకు రోడ్డు పనులు చేపట్టారు. అయితే అధికారిక రికార్డులను నిర్దేశించిన విధానాలను పాటించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి 2001, జూలై 16న ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఇక 2014 సీతంపేటలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా శ్రీనివాస్ పనిచేశారు. ఒక చిన్న కాంట్రాక్టర్ దగ్గర రూ.3 వేలు లంచాన్ని డిమాండ్ చేశారు. అప్పట్లో చెక్కు రూపంలో జూనియర్ అసిస్టెంట్ సదరు కాంట్రాక్టర్ నుంచి రూ.3 వేలు తీసుకుని ఏసీబీ అధికారులకు చిక్కారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రోద్బలంతోనే తాను చెక్కు తీసుకున్నట్లు జూనియర్ అసిస్టెంట్ ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అప్పట్లో పనిచేసిన శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఈ కేసు ఏసీబీ కోర్టులోనే ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్వతీపురం ఐటీడీఏలోని సూపరింటెండెంట్ ఇంజనీర్... తన మాట వినడం లేదని మన్యం జిల్లా నుంచి ఆ పోస్టును తొలగించారు. గతంలో ఒక కాంట్రాక్టర్ చేసిన మోసంలో పార్వతీపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని సస్పెండ్కు ఆదేశాలు ఇచ్చారు. ఇలా ఎంతో మంది శ్రీనివాస్ తీరుతో ఇబ్బందులపాలయ్యారు.