Share News

murder మందలిస్తే.. కడతేర్చాడు!

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:30 PM

Reprimanded... He Took a Life! తన సమీప బంధువు అయిన బాలిక వెంటపడుతున్న ఓ యువకుడిని ఓ వ్యక్తి మందలించారు. తీరు మార్చుకోవాలని సూచించారు. అయితే ఈ మాటలను ఏ మాత్రం చెవికెక్కించుకోని ఆ యువకుడు బాలిక బంధువును హత్య చేశాడు. ఈ ఘోరం సాలూరు మండలం పురోహితునివలసలో చోటుచేసుకుంది.

 murder మందలిస్తే.. కడతేర్చాడు!

  • యువతి వెంటపడొద్దన్నందుకే..

సాలూరు రూరల్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): తన సమీప బంధువు అయిన బాలిక వెంటపడుతున్న ఓ యువకుడిని ఓ వ్యక్తి మందలించారు. తీరు మార్చుకోవాలని సూచించారు. అయితే ఈ మాటలను ఏ మాత్రం చెవికెక్కించుకోని ఆ యువకుడు బాలిక బంధువును హత్య చేశాడు. ఈ ఘోరం సాలూరు మండలం పురోహితునివలసలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవుబుచ్చింపేటకు చెందిన జి.శంకరరావు అలియాస్‌ శ్యాం అనే యువకుడు ప్రేమ పేరుతో కొద్దిరోజులుగా మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలిక వెంట పడుతున్నాడు. ఇది నచ్చని బాలిక ఇంట్లో విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి, ఆమె సమీప బంధువు షేక్‌ అబ్దుల్‌ అలియాస్‌ జలీల్‌ ఇటీవల శంకరరావును కలిసి మందలించారు. బాలిక వెంటపడడం సరికాదని జలీల్‌ తెలిపారు. అయితే ఆ యువకుడి తీరులో మార్పు రాలేదు. మళ్లీ బాలిక వెంటపడడంతో ఈ నెల 20న జలీల్‌ మరోసారి శంకరరావును మందలించారు. తీరు మార్చుకోవాలని సూచించారు. సోమవారం పెదపదం గ్రామానికి యూరియా తీసుకెళ్లిన జలీల్‌ అదేరోజు రాత్రి స్వగ్రామం పురోహితునివలసకు తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే మార్గమధ్యంలో శంకరరావు కనిపించాడు. ఇకపై తన బంధువు అయిన బాలిక వెంట పడొద్దని జలీల్‌ హెచ్చరించడంతో వారి మధ్య వాదన జరిగింది. అనంతరం జలీల్‌ పురోహితునివలసకు పయనమవగా.. ఆ గ్రామ పోలిమేరలకు ఆయన కంటే ముందుగా శంకరరావు చేరుకున్నాడు. ప్రాథమిక పాఠశాల వద్ద వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. శంకరరావు కత్తితో పొడవడంతో జలీల్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటా స్థలానికి చేరుకున్నారు. జలీల్‌ను వైద్యసేవల నిమిత్తం ఆటోలో సాలూరులోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే జలీల్‌ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. హతుడికి భార్య, మూడేళ్ల బాబు, మూడు నెలల పాప ఉన్నారు. తమకిక దిక్కెవరని వారితో పాటు జలీల్‌ తండ్రి ఖాన్‌, తల్లి హసినా, సోదరుడు ఖలీల్‌ భోరున విలపించారు. మంగళవారం ఖలీల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాలూరు రూరల్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. ప్రశాంతంగా ఉండే పురోహితునివలసలో హత్య జరగడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Updated Date - Jul 22 , 2025 | 11:30 PM