Recognition for those who have worked hard కష్టపడ్డ వారికి గుర్తింపు
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:39 AM
Recognition for those who have worked hard తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, వారి పనితీరు బట్టి పదవులు వస్తాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో జరిగిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన కలిశెట్టి అప్పాలనాయుడు ఎంపీ అయ్యారని ఉదహరించారు.
కష్టపడ్డ వారికి గుర్తింపు
కలిశెట్టి అప్పలనాయుడి కృషే ఇందుకు నిదర్శనం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు
కార్యకర్తల్లో జోష్ నింపిన అధ్యక్షుడితో ఫొటో సెషన్
విజయనగరం/ గజపతినగరం/ గంట్యాడ/ మెంటాడ/ దత్తిరాజేరు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి):
తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, వారి పనితీరు బట్టి పదవులు వస్తాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో జరిగిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన కలిశెట్టి అప్పాలనాయుడు ఎంపీ అయ్యారని ఉదహరించారు. అతని కష్టాన్ని గుర్తించి ఎంపీ టికెట్ ఇస్తే మంచి మెజారిటీతో గెలిచి ఇప్పుడు కష్టపడి పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని చంద్రబాబు కొనియాడారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులదేనని నొక్కి చెప్పారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని, అందుకు పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. తాను నాల్గోసారి ముఖ్యమంత్రి అయ్యానని, గతంలో ఎప్పుడూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని, ఈసారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలియజేశారు. పార్టీపరంగా కేడర్ అభివృద్ధికి కూడా పెద్దపీట వేశామని, దేశంలో ఏ రాజకీయ పార్టీ తన కార్యకర్తలకు బీమా సదుపాయాన్ని కల్పించిన దాఖలాలు లేవని, ఇందుకోసం టీడీపీ ఏడాదికి రూ.40 కోట్లకుపైగా ప్రీమియంగా చెల్లిస్తోందని తెలిపారు. గజపతినగరం నియోజకవర్గానికి వస్తే క్యాడర్ పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర యావరేజ్ కన్నా ముందున్నప్పటికీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. విజన్ 2047 నాటికి రాష్ట్రంలో కుటుంబ వార్షిక తలసరి ఆదాయం సగటున రూ.55 లక్షలపైగా ఉంటుందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆదాయం అంతకన్నా మెరుగ్గా ఉండాలని చెప్పారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఎన్నికల్లో పోటీచేయడం మొదటిసారి అయినప్పటికీ ఈ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కష్టించి పనిచేశారని, వారి కృషి ఫలితంగానే తాను శాసనసభ్యుడుగా రాష్ట్ర మంత్రిగా ఉన్నానన్నారు. కార్యకర్తల సమావేశం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఫొటో తీసుకునే అవకాశం ముఖ్యమంత్రి కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జోనల్ ఇన్చార్జి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.