Elephants గజరాజుల బీభత్సం
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:50 PM
Rampage of Elephants పార్వతీపురం మండలాన్ని గజరాజులు వీడడం లేదు. గత కొద్దిరోజులుగా ఆ ప్రాంతంలోనే సంచరిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. యథేచ్ఛగా పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయి. వాటివల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో ప్రజలకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.
లబోదిబోమంటున్న రైతులు
పార్వతీపురం రూరల్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలాన్ని గజరాజులు వీడడం లేదు. గత కొద్దిరోజులుగా ఆ ప్రాంతంలోనే సంచరిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. యథేచ్ఛగా పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయి. వాటివల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో ప్రజలకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ఇప్పటికే పెదమరికి, చినమరికి, బండిదొరవలస తదితర ప్రాంతవాసులను హడలెత్తించిన గజరాజులు శనివారం రాత్రి బోడికొండ సమీపంలో బీభత్సం సృష్టించాయి. లక్ష్మీనారాయణపురం రెవెన్యూ పరిధిలో సుమారు 150 కొబ్బరి, అరటి మొక్కలు, మూడు మోటారు ఇంజన్లు, డ్రిప్ ఇరిగేషన్ పైపులను నాశనం చేశాయి. దీంతో ఆ ప్రాంత రైతులు లబోదిబోమంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. మరోవైపు గజరాజులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పార్వతీపురం రేంజర్ మణికంఠేశ్ను వివరణ కోరగా.. ‘ నష్టపోయిన పంటలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తాం. దీనిపై రెవెన్యూ అధికారులు నివేదిక ఇవ్వాల్సి ఉంది. పార్వతీపురం మండలంలో గజరాజుల వల్ల రైతులు పంటలు, మోటార్లను నష్టపోవడం వాస్తవమే. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ’ అని తెలిపారు.